వరుసగా పదో విజయం
తాజా విజయంతో యువ భారత్ పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఆసీస్పై సాధించిన విజయం అండర్-19 ప్రపంచకప్లో భారత్కు వరుసగా పదో విజయం. దీంతో ప్రపంచకప్లో వరుసగా పది విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా వరల్డ్ రికార్డును ఖాతాలో వేసుకుంది. 2018-2020 మధ్యలో జరిగిన రెండు ప్రపంచకప్లలో భారత్ వరుసగా పది విజయాలు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. 2002-04 మధ్యలో ఆసీస్ వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది.
ఎనిమిది వరుస విజయాలు మూడుసార్లు
అండర్-19 ప్రపంచకప్లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన జట్ల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. భారత్ మూడుసార్లు ఈ ఘనత అందుకుంది. 2000-02, 2008-10, 2012-14లలో మూడుసార్లు వరుస ఎనమిది విజయాలు ఖాతాలో వేసుకుంది. ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా కూడా గతంలో వరుసగా ఎనిమిది విజయాలు సాధించాయి.
టీమిండియా @ 200
తాజా విజయంతో టీమిండియా యూత్ క్రికెట్లో 200 మార్కును అందుకుంది. దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. మొత్తంగా 261 మ్యాచ్లాడిన భారత్.. 200 విజయాలు, 56 ఓటములు నమోదు చేసింది. రెండు టై మ్యాచ్లు ఉండగా.. మరో మూడింట్లో ఫలితం రాలేదు. మరోవైపు భారత గెలుపోటముల నిష్పత్తి బాగానే ఉంది.
యువ భారత్ విజయం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత అండర్-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకొలేకర్ (54 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు చేసారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 43.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కార్తీక్ త్యాగి (4/24) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కంగారూలు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్ సామ్ ఫనింగ్ (75) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆకాశ్ సింగ్ 3 వికెట్లు తీసాడు.