వెస్టిండీస్: అండర్ 19 వరల్డ్కప్లో యువ భారత్ సత్తా చాటుతోంది. టోర్నీ అసాంతం ఏక పక్ష విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. తాజాగా క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ను సునాయసంగా ఓడించి ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జట్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో గత ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమికి యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బౌలర్లు బంగ్లాదేశ్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేయగా.. అనంతరం బ్యాటర్లు లాంఛనాన్ని పూర్తి చేశారు.
మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఓ దశలో 56 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. కానీ ఈ సమయంలో మెహెరోబ్, అషికర్ జమాన్ జట్టును ఆదుకున్నారు. ఆ జట్టు బ్యాటర్లలో మెహెరోబ్(30), ఐచ్ మొల్లా (17), అషికర్ జమాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రవి కుమార్ 3 వికెట్లతో సత్తా చాటాడు. విక్కీ ఓస్ట్వాల్ 2, అంగ్క్రిష్ రఘువంశీ, కౌశల్ థాంబే, రాజవర్దన్ తలో వికెట్ తీశారు. అనంతరం 112 పరుగలు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పరుగులేమి చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ హర్నూర్ సింగ్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ రఘువంశీ, తెలుగు కుర్రాడు షేక్ రషీద్ రెండో వికెట్కు 70 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
ఈ క్రమంలో 44 పరుగులు చేసిన రఘువంశీ, 26 పరుగులు చేసిన షేక్ రషీద్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అయినప్పటికీ కెప్టెన్ యష్ ధూల్.. సిద్ధార్థ్ యాదవ్, కౌశల్ థాంబేతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో 30.5 ఓవర్లలో యువ భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ యష్ ధూల్ 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిపాన్ మోండోల్ 4, హాసన్ ఒక వికెట్ తీశారు. 3 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా బౌలర్ రవికుమార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా అండర్ 19 ఆసియ్ కప్ సెమీఫైనల్లోనూ భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. కాగా ఈ ప్రపంచకప్లో యువ భారత్ టైటిల్ ఫేవరేట్కు బరిలోకి దిగింది.