అంటిగ్వా: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. యువ భారత్ పేసర్ల ధాటికి ఇంగ్లండ్ అండర్ 19 జట్టు ఏ దశలోనూ భారీ స్కోర్ సాధించేలా కనిపించలేదు. ఆరంభంలో రవి కుమార్ దెబ్బ కొట్టగా.. తర్వాత రాజ్ బావ దెబ్బకొట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 50 పరుగులు కూడా చేయకుండానే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పట్టుదలగా ఆడిన ఆ జట్టు బ్యాటర్ జేమ్స్ రెవ్ జట్టును ఆదుకున్నాడు. చివరికి భారత్ ముందు ఇంగ్లండ్ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
చెలరేగిన రవికుమార్, రాజ్ బావ
రవికుమార్, రాజ్ బావ తమ పేస్ బౌలింగ్తో చెలరేగడంతో 13 ఓవర్లలో 47 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ను ఆరంభంలోనే రవి కుమార్ దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్టు తీయడంతో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం రాజ్ బావ చెలరేగాడు. వరుసగా 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ను కూల్చాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కనీసం 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు.
ఆదుకున్న జేమ్స్ రూ
ఈ దశలో జేమ్స్ రూ ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. సహచరుల నుంచి ఎలాంటి మద్దతు లభించకపోయినప్పటికీ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కాసేపు సహకరించిన వికెట్ కీపర్ అలెక్స్ హోర్టన్ 10 పరుగులు చేసి జట్టు స్కోర్ 91 పరుగుల వద్ద ఉండగా ఏడో వికెట్ రూపంలో కౌశల్ థాంబే బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ సమయంలో జేమ్స్ రెవ్.. జేమ్స్ సెల్స్తో కలిసి జట్టును ఆదుకున్నాడు.
సూపర్ క్యాచ్తో జేమ్స్ రూ సెంచరీ మిస్
జేమ్స్ రూ, జేమ్స్ సెల్స్ కలిసి ఎనిమిదో వికెట్కు ఏకంగా 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో జేమ్స్ రూ సెంచరీకి చేరువయ్యాడు. సెంచరీ ఖాయమనుకున్న సమయంలో రవి కుమార్ చెలరేగాడు. ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 12 ఫోర్లతో 116 బంతుల్లో 95 పరుగులు చేసిన జేమ్స్ రెవ్ను రవి కుమార్ ఔట్ చేశాడు. జేమ్స్ రూ ఇచ్చిన సూపర్ క్యాచ్ను ఫీల్డర్ కౌశల్ థాంబే అద్భుతంగా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో 184 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఔట్ అవడంతో ఇంగ్లండ్ ఆలౌటవడానికి ఎంతో సమయం పట్టలేదు.
భారత్ లక్ష్యం 190 పరుగులు
ఇక 44.5 ఓవర్లలో ఇంగ్లండ్ 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ సెల్స్ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్ బావ 5, రవి కుమార్ 4 వికెట్లతో చెలరేగారు. కౌశల్ థాంబే ఇక వికెట్ తీసుకున్నాడు. దీంతో భారత అండర్ 19 జట్టు ముందు ఇంగ్లండ్ అండర్ 19 జట్టు 190 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.