పెవిలియన్కు క్యూ
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జపాన్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ మార్కస్ తుర్గేట్ (1), నీల్ డేట్ (0)ను త్యాగి పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ షు నోగుచి (7)ని బిష్ణోయ్ ఔట్ చేసాడు. ఆ తర్వాత జపాన్ బ్యాట్స్మన్ భారత బౌలర్ల దాడి ముందు నిలవలేకపోయారు. ఒక్కొకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఓ దశలో జపాన్ బ్యాటింగ్ ఆర్డర్లోని ఐదుగురు బ్యాట్స్మన్లు వరుసగా డకౌట్ అయ్యారు.
8 ఓవర్లు.. 5 పరుగులు.. 4 వికెట్లు
జపాన్ ఆటగాళ్లు షు నోగుచి (7), కెంటో ఓటా డోబెల్ (7) చేసిన పరుగులే అత్యధికం. మాక్స్ క్లెమెంట్స్ 5 పరుగులు చేసాడు. నీల్ డేట్, దేబాషిష్ సాహూ, కజుమాసా తకాహషి, ఇషాన్ ఫర్తాల్, యాష్లే తుర్గేట్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్ బిష్ణోయ్ 8 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. మరో బౌలర్ త్యాగి 6 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. జపాన్ 41 పరుగులకే ఆలౌట్ అయి టీమిండియా ముందు 42 పరుగుల స్వల్ప లక్ష్యంను ఉంచింది.
రెండో అత్యల్ప స్కోరు
అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో జపాన్ రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2004లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 ఆలౌట్ అయింది. కెనడా మరియు బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ యొక్క 2002 మరియు 2008 ఎడిషన్లలో వరుసగా 41 పరుగులు చేసాయి. అనంతరం జపాన్ కూడా 41 పరుగులకు ఆలౌట్ అయింది.
శ్రీలంకపై ఘన విజయం
భారత్ అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (74 బంతుల్లో 8 ఫోర్లతో 59), కెప్టెన్ ప్రియం గార్గ్ (72 బంతుల్లో 2 ఫోర్లతో 56) భారీ స్కోర్ అందించగా.. ఆకాశ్ సింగ్, సిద్ధేశ్ వీర్ లంక పతనాన్ని శాసించారు.