అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా తాజాగా టీమిండియా, స్కాట్ లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగుమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. అండర్ 19 టీ20 ప్రపంచకప్ లో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచింది.
ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ వరల్డ్ కప్ ప్రారంభం నుంచి సూపర్ ఫామ్ కనబరుస్తోన్న భారత బ్యాటర్లు.. తాజాగా జరిగిన మ్యాచ్ లోనూ మరోసారి రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలుగమ్మాయి గొంగడి త్రిష.. ఈ టోర్నీలోని ప్రతి మ్యాచ్లోనూ అదిరే ప్రదర్శన చేస్తూ వస్తోంది. తన అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు స్కాట్ లాండ్ బౌలర్లపై కూడా విజృంభించింది.

మొదటి బంతి నుంచి దూకుడుగా ఆయన త్రిష.. బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయింది. 52 బంతుల్లో నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో సెంచరీ నమోదు చేసింది. ఓపెనర్ కమలిని(51) హాఫ్ సెంచరీ చేయగా, సానికా చల్కే (29*) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. దీంతో ఇప్పటికే సెమీస్కు చేరుకున్న భారత జట్టు.. ఇప్పుడు సూపర్ సిక్స్లోని తన చివరి మ్యాచ్లోనూ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది.
తొలి వికెట్కు 147 పరుగులు
ఓపెనర్లు త్రిష - కమలిని కలిసి మొదటి వికెట్కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అర్ధ శతకం బాదిన తర్వాత కమలిని ఔటైనప్పటికీ.. సానికాతో కలిసి చివరి వరకూ క్రీజ్లో ఉన్న త్రిష రెండో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం జోడించింది. ఈ క్రమంలో అండర్ 19 ప్రపంచ కప్లో సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా నిలిచింది.