
హైదరాబాద్: గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అండర్-19 వరల్డ్కప్ను నాలుగోసారి గెలిచి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకు 47.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్ కోటి, శివ సింగ్, ఇషాన్ పోరేల్ తలో రెండు వికెట్లు తీసుకోగా, శివమ్ మావి ఒక వికెట్ తీశాడు.
అనంతరం ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 38.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. ఓపెనర్ మన్జోత్ కల్రా (101 నాటౌట్) సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్లో పృథ్వి షా సేన ఓ ఛాంపియన్ జట్టులా ఆడింది.
అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. తాజా విజయంతో అండర్-19 వరల్డ్ కప్ను నాలుగోసారి గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది.
దీంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు, సినిమా హీరోలు భారత జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఎన్నడూ లేనిది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలపడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను సైతం అభినందించారు. ఈ గెలుపును ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నారని పేర్కొన్నారు. అభినందనలు తెలిపిన వారిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, బుమ్రా, పుజారా, అశ్విన్ తదితరులు ఉన్నారు.
భారత్ గెలుపుపై ట్విట్టర్లో ఎవరేమన్నారంటే: