
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్కు భారత జట్టు అడుగు దూరంలో నిలిచింది. పాకిస్థాన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి ఫైనల్కు అర్హత సాధించింది.
ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో మూడు సార్లు వరల్డ్ కప్లను గెలుచుకోవడం ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు మరింత కనువిందు చేయనుంది. 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల దెబ్బకు కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ పృథ్వీ షా, మన్జోత్ కల్రాతో కలిసి తొలి వికెట్కు 89పరుగులు జోడించారు.
దూకుడుగా ఆడే క్రమంలో పృథ్వీ షా 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కల్రా హాఫ్ సెంచరీకి చేరువయ్యే క్రమంలో 47 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో 94 పరుగులకు టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.
94 బంతుల్లో 102 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. గిల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన దేశాయ్ జట్టు స్కోరు 148 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రాయ్ 45 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ ముసా నాలుగు, అర్షద్ ఇక్బాల్ మూడు వీకెట్లు తీశారు. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్మెన్ వరుసగా క్యూ కట్టారు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
ఇషాన్ పోరెల్ ఆరు ఓవర్లకు 17పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇమ్రాన్ షా(2), మహమ్మద్ జైద్(7)లతో పాటు అలీ జర్యబ్ ఆసిఫ్(1) పోరెల్ ధాటికి ఐదు ఓవర్లకే పెవిలియన్ బాట పట్టారు. మరో బౌలర్ పరాగ్ కూడా చెలరేగి రోహైల్ నజీర్(18), హసన్ ఖాన్(1)ను వెంటవెంటనే పెవిలియన్ పంపాడు.
25 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 48పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత షాద్ ఖాన్(15) కాసేపు నిలబడే ప్రయత్నం చేసిన వికెట్ కీపర్ దేశాయ్ అతడిని స్టంపౌంట్ చేశాడు. చివర్లో అర్షద్ ఇక్బాల్ను అభిషేక్ శర్మ ఔట్ చేయడంతో పాక్ 69 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో శివసింగ్, రియాన్ పరాగ్ తలో రెండేసి వికెట్లు తీశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.