హైదరాబాద్: అండర్ 19 క్రికెటర్ హర్మీత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరీ రైల్వే స్టేషన్లోకి కారుతో సహా చొచ్చుకొచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం 7. 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హర్మీత్ సింగ్ తన హ్యుందాయ్ సెడాన్ కారు సహా అంధేరీ రైల్వేస్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ పైకి దూసుకురావటం గందరగోళాన్ని సృష్టించింది. కారు నేరుగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాట్ఫామ్పై నుంచి పరుగులు తీశారు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఉదయం వేళ కావడంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఉన్న హర్మీత్ సింగ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
నిబంధనలు ఉల్లఘించినందుకు హర్మీత్ ను అరెస్ట్ చేశామని అంధేరీ ఆర్పీఎఫ్ సీనియర్ ఇన్స్ పెక్టర్ మనీశ్ రాథోడ్ తెలిపారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 154 కింద అతడిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. హర్మీత్ బాంద్రా నుంచి మలాడ్ వెళ్తూ పొరబాటున మలుపు తీసుకోవడంతో స్టేషన్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో హర్మీత్ దోషిగా తేలితే మూడేళ్లవరకు జైలు శిక్షపడొచ్చని ఆయన అన్నారు. రద్దీ సమయంలో ఈ ఘటన జరిగితే పరిస్థితి దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. గత నవంబర్లో కూడా ఒక ఇన్నోవా కారు ఇదే రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫామ్పైకి ఇలాగే దూసుకొచ్చింది.