
టోప్లే స్కానింగ్ రిపోర్ట్..
ఇప్పుడు ఇంగ్లాండ్ గాయాలబారిన పడింది. దీని దెబ్బకు టైటిల్ హాట్ ఫేవరెట్గా అడుగు పెట్టిన ఇంగ్లాండ్కు బౌలింగ్ డిపార్ట్మెంట్ బలహీనపడినట్టే. ప్రధాన బౌలర్ రీస్ టోప్లే గాయపడ్డాడు. అతను టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. పాకిస్తాన్తో వామప్ మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో రీస్ టోప్లే గాయపడ్డాడు. స్కానింగ్ రిపోర్ట్లో కాలి మడమ చిట్లినట్లు తేలింది.

ఆరు వారాల పాటు విశ్రాంతి..
కనీసం ఆరు వారాల పాటు టోప్లేకు విశ్రాంతి అవసరమౌతుందని భావిస్తోన్నారు. ఒకట్రెండు రోజుల్లో అతను ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్లనున్నాడు. శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు ఈసీబీ తెలిపింది. ఇంగ్లాండ్ ఇప్పటికే జోఫ్రా అర్చర్ను కోల్పోయింది. సుదీర్ఘకాలంగా అర్చర్ క్రికెట్కు దూరంగా ఉంటోన్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నాటికి అందుబాటులోకి రావొచ్చని ఈసీబీ అంచనా వేసింది గానీ అది కార్యరూపం దాల్చలేదు.

టోప్లే స్థానంలో టైమల్..
ఇప్పుడు తాజాగా రీస్ టోప్లే కూడా తప్పుకోవాల్సి రావడం ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బగా పరిణమించింది. కాగా- టోప్లే స్థానంలో టైమల్ మిల్స్ను ఎంపిక చేసింది ఈసీబీ. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం టైమల్ మిల్స్- టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఈసీబీ ప్రకటించిన రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. అతనితో పాటు రిచర్డ్ గ్లీసన్ కూడా రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. గ్లీసన్ కంటే టైమల్ మిల్స్ వైపే మొగ్గ చూపింది ఈసీబీ.

భారత్తో చివరి టీ20..
ఆగస్టు 10వ తేదీ తరువాత ఇప్పటివరకు మిల్స్ క్రికెట్ మ్యాచ్లేవీ ఆడలేదు. కుడి పాదం గాయం నుంచి అతను ఈ మధ్యే కోలుకున్నాడు. వందశాతం ఫిట్నెస్ సాధించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన టీమిండియాతో ఎడ్జ్బాస్టన్లో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అది అతని కేరీర్లో 13వది. మూడు ఓవర్లల్లో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఏడు టీ20 మ్యాచ్ల సిరీస్కు ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు టైమల్ మిల్స్.


Click it and Unblock the Notifications












