వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో భారత ఓపెనర్లు చెలరేగారు. తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అతనికి శుభ్మన్ గిల్ కూడా మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించాడు కూడా.
ఈ మ్యాచ్ చివరకు జైస్వాల్ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో గిల్ 77 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి జైస్వాల్ లాంఛనం పూర్తిచేశాడు. ఈ క్రమంలోనే టీమిండియాకు తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రోహిత్, రాహుల్ పేరిట ఉన్న రికార్డును జైస్వాల్, గిల్ జోడీ సమం చేసింది.

ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఈ జంటను తెగ మెచ్చుకుంటున్నారు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను కుదురుకోనివ్వలేదని అంటున్నారు. మంచి స్కోరు చేసినా కూడా వెస్టిండీస్పై వీళ్లిద్దరూ తమ క్వాలిటీ బ్యాటింగ్తో ఒత్తిడి పెంచారంటూ గిల్, జైస్వాల్ ఇద్దర్నీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
ఈ సిరీసులో తొలి రెండు మ్యాచుల్లో ఇషాన్ కిషన్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ రెండు మ్యాచుల్లో కిషన్ దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఇప్పుడు జైస్వాల్ అదరగొట్టడంతో ఇక పొట్టి ఫార్మాట్లో కిషన్ చోటు కోల్పోయినట్లే అంటూ కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
కొంతకాలంగా సీనియర్ ప్లేయర్లు టీ20లు ఆడటం లేదు. అయితే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్పై టీమిండియా ఫోకస్ పెడుతుంది. అప్పుడు మళ్లీ రోహిత్, కోహ్లీ ఈ జట్టులో చేరే అవకాశం ఉంది. కానీ ఓపెనర్గా కేఎల్ రాహుల్ మాత్రం రాడంటూ ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు. జైస్వాల్, గిల్ అదిరిపోయే ఆరంభాలు ఇస్తుంటే.. జిడ్డు బ్యాటింగ్ చేసే రాహుల్ ఎందుకంటున్నారు.
ఇలా జైస్వాల్, గిల్ రాణించడం వల్ల పొట్టి ఫార్మాట్లో కిషన్, రాహుల్ ఇద్దరి కెరీర్ ముగిసిందని జోస్యం చెప్తున్నారు. గతంలో బీసీసీఐ వర్గాలు కూడా టీ20ల్లో రాహుల్ కెరీర్ ముగిసినట్లే అని అన్న వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఏదేమైనా భారత్కు ఈ ఫార్మాట్లో మంచి ఓపెనింగ్ జోడీ దొరికిందని అందరూ సంతోషిస్తున్నారు.