
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సడెన్గా టెన్షన్ పెరిగింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా పుంజుకొని మూడో టెస్టులో నెగ్గడంతో సిరీస్ సీరియస్గా మారింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరి టెస్టుపై ఆసక్తి కూడా పెరిగింది. అంతేకాదు, ఇండోర్ టెస్టు జరిగిన పిచ్కు ఐసీసీ నుంచి పూర్ రేటింగ్ రావడంతో అహ్మదాబాద్ పిచ్పై కూడా చర్చ మొదలైంది. ఇక్కడ కూడా టర్నింగ్ పిచ్ తయారు చేస్తారా? లేక నార్మల్ పిచ్పై ఆడతారా? అని ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తమకైతే టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ రాలేదని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం క్యురేటర్లు చెప్పేశారు. దీంతో తాము నార్మల్ పిచ్నే తయారు చేస్తున్నామని వెల్లడించారు. అంటే ఇక్కడ భారీ స్కోర్లు నమోదవడమే కాకుండా.. పిచ్ నుంచి బౌలర్లకు కూడా మంచి సహకారం అందుతుందని తెలుస్తోంది. కానీ ఈ వార్తలు నిజమేనా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న చాలా మంది ఒక వింత విషయాన్ని గుర్తించారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు పిచ్లను కవర్స్ కింద దాచి ఉంచారు. ఇది చూసిన జర్నలిస్టులకు మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్ ఏదో అర్థం కాకుండా పోయింది. మ్యాచ్ ప్రారంభం అవడానికి ఎక్కువ సమయం కూడా లేదు. అయినా ఇప్పటి వరకు ఏ పిచ్పై మ్యాచ్ జరిపించాలనే విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక్కడ జరిగే మ్యాచ్ గెలిస్తేనే భారత జట్టు కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుతుంది. ఇండోర్లో విజయంతో ఆస్ట్రేలియా ఇప్పటికే ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రెండు పిచ్లు చూసిన నెటిజన్లు.. మ్యాచ్ దేనిపై జరుగుతుందో? అది ఎలాంటి పిచ్ అవుతుందో? తెలియక తలలు బాదుకుంటున్నారు.