
గిల్ జిడ్డు బ్యాటింగ్
తన టీ20 కెరీర్లో తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన శుభ్మన్ గిల్.. మూడో మ్యాచ్లో నిదానంగా క్రీజులో కుదురుకోవాలని అనుకోవడం తప్పేంకాదు. కానీ టీ20 మ్యాచ్లో ఎవరైనా ఎంత నిదానంగా ఆడతారు? గిల్ ఒక విధంగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.
అతను మొదటి 9 బంతుల్లో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చెయ్యలేదు. తప్పక గెలవాల్సిన టీ20 మ్యాచ్లో ఇంతటి నిదానమైన ఆరంభం ఇవ్వడం ఒక ఓపెనర్ చెయ్యాల్సిన పని కాదు. పోనీ ఆ తర్వాతైనా గట్టి షాట్లు ఆడాడా? అంటే అదీ లేదు. మొత్తం 36 బంతుల్లో 46 పరుగులు మాత్రమే చేశాడు.

కెప్టెన్ హార్దిక్ ఫెయిల్
ఛేజింగ్లో శ్రీలంక తమ ఇన్నింగ్స్ను ధాటిగానే ఆరంభించింది. అయితే భారత బౌలర్లు రాణించడంతో పవర్ప్లే ముగిసే సరికి 44/2 స్కోరుతో నిలిచింది. అప్పటికే మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప లంక గెలవడం అసాధ్యం అని తేలిపోయింది. ఇలాంటి సమయంలో యువ బౌలర్ శివమ్ మావి వంటి వారిని పాండ్యా ఉపయోగించుకోవాల్సింది.
ఈ సిరీస్లోనే అరంగేట్రం చేసిన అతనికి లంకేయులు ఎదురు దాడి చేయడం ఒక విధంగా మంచి పాఠంగా మారేది. అయితే పాండ్యా మాత్రం పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన ఓవర్ల కోటా కూడా పూర్తి చేసుకున్నాడు. మావి ఈ మ్యాచ్లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు. జట్టులో ఆరో బౌలర్ అయిన పాండ్యా.. తర్వాత వన్డే సిరీస్ కూడా ఉన్న నేపథ్యంలో బౌలర్లను సరిగా ఉపయోగించుకొని, తను బౌలింగ్ చేయకుండా ఉండాల్సింది.

మాస్టర్స్ట్రోక్ సూర్య, రాహుల్ జోష్
ఈ మ్యాచ్లో భారత్ను గెలిపించిన జోడీ రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్. ఒకపక్క శుభ్మన్ గిల్ జిడ్డు బ్యాటింగ్తో ఏడిపిస్తుంటే.. మరో ఎండ్లో త్రిపాఠీ, సూర్య మాత్రం లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటం వల్లనే భారత జట్టు ఒడ్డున పడిందని చెప్పాలి. మ్యాచ్ టోన్ను త్రిపాఠీ (16 బంతుల్లో 35) తన ఇన్నింగ్స్తో సెట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్) దాని స్వరూపాన్ని మార్చేశాడు. వీళ్లిద్దరూ గొప్ప ఇంటెంట్తో ఆడటమే ఈ మ్యాచ్లో టీమిండియా మాస్టర్ స్ట్రోక్ అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత బౌలర్లు కూడా రాణించడంతో మ్యాచ్తోపాటు సిరీస్ కూడా భారత్ ఖాతాలో పడింది.


Click it and Unblock the Notifications












