హైదరాబాద్: చైనాలో క్రికెట్ అభివృద్ధికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇద్దరు చైనా క్రికెటర్లను వచ్చే ఏడాది జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్లో (పీఎస్ఎల్) ఆడేందుకు గాను అంగీకరించింది. దీంతో చైనాలో కూడా క్రికెట్కు ఆదరణ లభిస్తుందని ఇరు దేశాల బోర్డులు భావిస్తున్నాయి.
చైనా నేషనల్ క్రికెట్ జట్టుకి చెందిన ఇద్దరు ఆటగాళ్లు వచ్చే పాకిస్థాన్ సూపర్ లీగ్లో పెషావర్ జాల్మి జట్టు తరపున ఆడనున్నట్టు పాక్ అధికారిక పత్రిక ఏపీపీ వెల్లడించింది. చైనాలో పురుషులు, మహిళలకు జాతీయ క్రికెట్ జట్లు ఉన్నప్పటికీ, గుర్తించ దగిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో పలు మ్యాచ్లు ఆడినప్పటికీ ఇంకా చైనా జట్టుకు తగిన గుర్తింపు రాలేదు. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు ఆసక్తి చూపని సంగతి తెలిసిందే. దీంతో తమ జట్టు ఆడే మ్యాచ్ల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యూఏఈ సహా పలు దేశాలపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా వాటితో పోలిస్తే చైనాయే తమకు తటస్థ వేదిక కాగలదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తున్నట్టు ఏపీపీ పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించింది. 2009లో లాహోర్లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన ఎనిమిదేళ్ల అనంతరం మళ్లీ అదే శ్రీలంక ఈ ఏడాది సెప్టెంబర్లో పాక్లో ఓ టీ20 ఆడేందుకు అంగీకరించింది.