నొప్పితో ఇబ్బంది పడుతూ
నొప్పితో ఇబ్బంది పడుతూ కూడా ధావన్ తన బ్యాటింగ్ను కొనసాగించాడు. ఈ మ్యాచ్లో ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, నొప్పి కారణంగా ధావన్ ఫీల్డింగ్ చేయలేదు. ధావన్ స్థానంలో మ్యాచ్ మొత్తం రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు.
ధావన్ టోర్నీకి దూరం
గాయం కారణంగా శిఖర్ ధావన్ టోర్నీకి దూరం కావడంతో ఆతడి స్థానంలో ఎవరితో భర్తీ చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ధావన్ స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్కు చోటు కల్పించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరోవైపు అంబటి రాయుడు కూడా రేసులో ఉన్నాడు.
స్టాండ్ బై ఆటగాళ్లుగా
ధావన్ లాగే రిషబ్ పంత్ కూడా ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ కావడంతో అతడివైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. వరల్డ్కప్కు ముందు వీరిద్దరినీ బీసీసీఐ స్టాండ్ బై ఆటగాళ్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఒకరు ఇంగ్లాండ్ పయనం కానున్నారు. మరోవైపు రోహిత్ శర్మతో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలో దిగనున్నాడు.
గురువారం న్యూజిలాండ్తో మ్యాచ్
టోర్నీలో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్ల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్లతో తలపడనుంది. ఆ మ్యాచ్తో ఓపెనింగ్, నాలుగో స్థానంపై కూడా స్పష్టత రానుంది. ధావన్ లేని లోటు భారత్ విజయావకాశాలపై పడనుంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాక్తో కీలక మ్యాచ్కు ముందు కోహ్లీసేనకు ఆందోళన కలిగించే అంశం ఇది.