
హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే వన్డే సిరీస్ చేజార్చుకుంది. అనంతరం జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోవడంతో ఇంకా ఒక్క టెస్టు గెలుచుకుంటే ఇంగ్లాండ్ గెలిచేసినట్లే. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియాపై ఆశలు వదులుకున్న క్రికెట్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తిట్ల దండకం మొదలుపెట్టారు. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం టీమిండియా కోచ్ రవిశాస్త్రియే నంటూ అతని స్థానాన్నివీలైనంత త్వరగా మార్చేయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతటితో అయిపోలేదు. అతని బదులు టీమిండియా కోచ్గా ప్రస్తుతం అండర్ 19జట్టుకు కోచ్గా వ్యవహరిస్తోన్న రాహుల్ ద్రవిడ్ను కోచ్గా చేస్తే టీమిండియా విదేశీ పర్యటనల్లోనూ కచ్చితంగా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. టెస్టు సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పరవాలేదనిపించి 31 పరుగుల తేడాతో ఓడింది. ఇక రెండో టెస్టు విషయానికొస్తే ఏకంగా గెలుపుకు సుదూరంగా 159 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్మెన్ ప్రదర్శన పేలవంగా సాగింది.
ద్రవిడ్ ఇప్పటికే అండర్ 19జట్టు కోచ్గా న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన ఐసీసీ అండర్ 19 జట్టును ప్రపంచ విజేతగా నిలిపాడు. అంతేకాదు భారత్ ఏ జట్టుకు కోచ్గా వ్యవహరించి ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో లంక-ఏ జట్టుపై భారత్-ఏ జట్టును గెలిపించాడు. కేవలం కోచ్గానే కాకుండా జట్టు కన్సల్టంట్గానూ వ్యవహరిస్తోన్న ద్రవిడ్ను కోచ్గా రావాలంటూ కోరుకుంటోన్న నెటిజన్లకు నిరాశ తప్పదేమో.
ద్రవిడ్కు కోచ్గానే కాదు. ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్మన్గానూ మంచి పేరుంది. 2007లో మూడు టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటన చేసిన టీమిండియా విజయంతో ముగించింది. ఈ జట్టులో ద్రవిడ్ టెస్టు స్పెషలిస్టుగా రాహుల్ ద్రవిడ్ కీలకంగా వ్యవహరించాడు. అతని కెరీర్లో కేవలం ఇంగ్లాండ్ గడ్డపైనే ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లిష్ గడ్డపై టీమిండియా వాల్ ద్రవిడ్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కపిల్ దేవ్ (1986), అజిత్ వాడేకర్ (1971) తర్వాత రాహుల్ ద్రవిడ్ (2007) నాయకత్వంలోనే టీమిండియా ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ గెలిచింది. ఇంగ్లిష్ గడ్డపై అతడు 21 టెస్టులు ఆడగా 60.93 సగటుతో 1,950 పరుగులు సాధించడం విశేషం.