హైదరాబాద్: రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో పదివేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో థంపీ బౌలింగ్లో నాలుగో ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి మూడు పరుగులు సాధించడంతో ఈ ఘనత సాధించాడు.
దీంతో టీ20 క్రికెట్లో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సులు), విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. క్రిస్ గేల్ విజృంభించి 38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.

ఐపీఎల్ పదో సీజన్కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్ ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ల్లో ఈ రికార్డుని సాధిస్తాడని అభిమానులు భావించినా అది జరగలేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన 60 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ ఆరంభ వేడుకల అనంతరం సన్ రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో క్రిస్ గేల్ 32 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి రావడంతో రెండు మ్యాచ్లకు గేల్ దూరమయ్యాడు. ఇలా ఈ సీజన్లో వరుస వైఫల్యాల తర్వాత మంగళవారం క్రిస్ గేల్ ఈ రికార్డుని సాధించాడు.
టీ20ల్లో వరల్డ్ రికార్డుని సృష్టించిన సందర్భంగా అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో క్రిస్ గేల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.