ఇండోర్: టీమిండియా బ్యాట్స్మెన్ అజ్యంకె రహానే టెస్టు క్రికెట్ చరిత్రలో మరో మైలు రాయిని అధిగమించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో రెండు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్న రహానే దాన్ని పూర్తి చేశాడు.
రహానే తన 29వ టెస్టు మ్యాచ్లో 49 ఇన్నింగ్స్లో ఈ ఘనతను సాదించాడు. తద్వారా టెస్టు క్రికెట్లో రెండు వేలకు పైగా పరుగులు సాధించిన 36వ భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే ఇప్పటివరకు 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు పూర్తి చేశాడు.
ముంబైకి చెందిన ఈ 28 ఏళ్ల బ్యాట్స్మెన్ 47.57 సగటుతో ఈ ఘనతను సాధించాడు. 2013లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో రహానే అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే ఇండోర్లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.