హైదరాబాద్: వరల్డ్ కప్ టోర్నీల్లో మహిళల క్రికెట్ మ్యాచ్లకు ఓవర్లను కుదించాలంటూ సలహా ఇచ్చి చిక్కుల్లో పడ్డాడు పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ వకార్ యూనిస్. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

వకార్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ మహిళల పట్ల వివక్షాపూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే కొద్దిరోజుల క్రితం ఐసీసీకి వకార్ ఓ ట్వీట్ చేస్తూ, మహిళల వరల్డ్ కప్ టోర్నీలో ఇరుజట్ల ఓవర్లూ 50 నుంచి 30 చేయాలని, 20 ఓవర్లు కుదించాలని అభిప్రాయపడ్డాడు.
అయితే, ఏ ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశాడో ట్విట్టర్లో ఆయన వివరించలేదు. దీంతో వకార్ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు సైతం విమర్శలు గుప్పించారు. తన వ్యాఖ్యల ద్వారా మహిళల పట్ల
వివక్ష చూపారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, చివరకు ఆయన సంజాయషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ మరో ట్వీట్ చేశారు. తక్కువ ఓవర్లుంటే వేగంతో పాటు ఆడియెన్స్ కూడా పెరుగుతాయని, కాంపటీటివ్ క్రికెట్గా కూడా మంచి పేరు వస్తుందన్నదే తన సూచన వెనుక ఉన్న ఉద్దేశమని వకార్ వివరణ ఇచ్చాడు. మహిళల పట్ల తనకు చిన్నచూపు లేదని కూడా అన్నాడు.