

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ట్విటర్లో ఫ్యాన్స్ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్తో శనివారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో 59 బంతులాడిన ధోనీ పేలవంగా రెండు ఫోర్లు మాత్రమే కొట్టి 37 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో.. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 236 పరుగులకే కుప్పకూలిపోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి పరుగుల కోసం తీవ్రంగా శ్రమించిన ధోనీ.. ఎక్కువగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు.
దీంతో.. క్రమంగా బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. మ్యాచ్లో ధోనీ కంటే చాహల్ (12: 12 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్తో మెరుగ్గా ఆడాడని ఫ్యాన్స్ చురకలు అంటిస్తున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జో రూట్ (113: 116 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సు) సెంచరీ బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్ వైఫల్యంతో రెండో వన్డేలో భారత్ భంగపడింది.
లక్ష్యఛేదనలో తడబడిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. రైనా (46; 63 బంతుల్లో ఒక ఫోర్), కోహ్లి (45; 56 బంతుల్లో 2ఫోర్లు) రాణించారు. ప్లంకెట్ (4/46), రషీద్ (2/38), విల్లీ (2/48) భారత్ను దెబ్బతీశారు. రూట్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ధోని (37; 59 బంతుల్లో 2ఫోర్లు), హార్దిక్ పాండ్య (21) క్రీజులో ఉన్నప్పుడు భారత్ కాస్త ఆశతోనే ఉంది.
కానీ 39వ ఓవర్లో పాండ్య ఔట్ కావడంతో అది కూడా పోయింది. ధోని 47వ ఓవర్కు వరకు క్రీజులోనే ఉన్నా భారత్ ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. కష్టంగా పరుగులొచ్చాయి. ధోని ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి సరిపోయిందంతే. టెయిలెండర్ల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. దీంతో.. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమవగా.. సిరీస్ విజేత నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.