
హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ 1-1తో సమం అయింది.
112/5 ఓవర్నైట్ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. హనుమ విహారి-పంత్ జోడీ కాసేపు క్రీజులో నిలబడినా పరుగులు మాత్రం రాలేదు. 47 ఓవర్లో స్టార్క్ తన పదునైన బౌలింగ్తో విహారి-పంత్ జోడీని విడదీశాడు. స్టార్క్ బౌలింగ్లో విహారి(28) మార్కస్ హారిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపు క్రీజులో ఉండి ఫోర్లతో మెరుపులు మెరిపించిన రిషబ్ పంత్ భారీషాట్కు ప్రయత్నించి హ్యాండ్స్ కోంబ్కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టెయిలెండర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఉమేశ్యాదవ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇషాంత్, బుమ్రా డకౌట్గా వెనుదిరగటంతో టీమిండియా 140 పరుగులకే ఆలౌటైంది.
ఆస్ట్రేలియా బౌలర్స్లో లియాన్, స్టార్క్ మూడు వికెట్స్ తీయగా, హాజిల్ వుడ్, కమిన్స్ చెరో రెండు వికెట్స్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్స్ తీసిన నాథన్ లియోన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో డిసెంబర్ 26న జరగనుంది.
రెండో టెస్టులో టీమిండియా ఓటమికి జట్టు కూర్పు, ఓపెనర్ల విఫలం, తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయాలే కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో టెస్టులో భారత జట్టు ఓటమిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.