హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకంలో భాగంగా ఆదివారం టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్గా మరోసారి ధోని తన మహేంద్ర జాలాన్ని చూపించాడు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదిలాడే ధోని.. ఈ మ్యాచ్లో గ్రాండ్హోమ్ను షాక్కు గురి చేశాడు.
కళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అతడిని పెవిలియన్కు పంపాడు. న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో గ్రాండ్హోమ్ను ధోని చేసిన ఈ స్టంపింగ్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ధోని స్టంపింగ్ చూసిన తర్వాత అతడిపై ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3/28), మహ్మద్ షమి (3/47) విజృంభించడంతో ఆదివారం భారత్ తన తొలి సన్నాహక మ్యాచ్లో సత్తా చాటింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది.
స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ కీలకంగా నిలిచారు. రెండో ఓవర్లోనే క్యాచ్ అవుటయ్యే ప్రమాదం నుంచి ధావన్ తప్పించుకోగా ఐదో ఓవర్లో రహానే (7) రూపంలో జట్టు తొలి వికెట్ను కోల్పోయింది. హుక్ షాట్కు ప్రయత్నించిన రహానే స్క్వేర్ లాంగ్ లెగ్లో బౌల్ట్కు దొరికిపోయాడు.
ఆ తర్వాత కోహ్లి, ధావన్ జోడి నిలకడగా ఆడుతూ అండగా నిలిచింది. వీరిద్దరి ఆటలో దూకుడు లేకపోయినా అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచారు. అయితే అర్ధసెంచరీ వైపు పయనిస్తున్న ధావన్ను 19వ ఓవర్లో నీషమ్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవర్ వ్యవధిలోనే దినేశ్ కార్తీక్ కూడా డకౌట్గా వెనుదిరిగాడు.
అటు సరిగ్గా 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లికి ధోని (21 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడవ్వడంతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. ఈ క్రమంలో 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు.
అప్పటికి డకవర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది. టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్ నెగ్గినట్టు ప్రకటించారు.