
హైదరాబాద్: ఏప్రిల్ 1, పూల్స్ డే. అలాంటి రోజున టెస్టు క్రికెట్లో ఐసీసీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. మరికొద్ది రోజుల్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభానికి ముందు కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు ఐసీసీ ట్విటర్లో పేర్కొంది. యువతకు క్రికెట్ను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
జులై 2019, జూన్ 2021 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ నుంచి ఈ మార్పులను ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా టెస్టుల్లో ఆటగాళ్లు తమ జెర్సీలపై వాళ్ల ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ను ఉంచాలన్నది ఒక ప్రతిపాదనగా ఉంది.
రాబోయే రోజుల్లో టాస్కు కూడా గుడ్ బై చెప్పనుంది ఐసీసీ. టాస్కు బదులుగా ట్విటర్ పోల్ నిర్వహించనున్నారు. దీని వల్ల అభిమానులే ఎవరు మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది ట్విటర్ పోల్ ద్వారా నిర్ణయించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ క్రికెట్లో కామెంటేటర్లు అంటే గ్రౌండ్ బయట ఏసీ రూముల్లో కూర్చొని కామెంట్రీ చెప్పేవారు. కానీ, తాజాగా ఐసీసీ ప్రతిపాదన ప్రకారం వాళ్లు నేరుగా ఫీల్డ్లో అడుగుపెట్టవచ్చు. మ్యాచ్ జరుగుతుంటే.. స్లిప్ ఫీల్డర్ వెనకాల నిలబడి కామెంటేటరీతో అభిమానులను అలరించవచ్చు.
ఒకే బంతికి రెండు వికెట్లు తీసే అవకాశాన్ని ఐసీసీ కల్పించనుంది. అంటే ఓ బంతికి బ్యాట్స్మన్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న తర్వాత అవతలి బ్యాట్స్మన్ను రనౌట్ చేసే వీలు కూడా కల్పించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఇక, అన్నింటికన్నా ముఖ్యంగా డేనైట్ టెస్టులను మరింత ఆసక్తికరంగా మార్చడానికి సాయంత్రం సెషన్లో బ్యాటింగ్ చేసే టీమ్కు రెట్టింపు పరుగులు ఇస్తే ఎలా ఉంటుందన్నది కూడా ఐసీసీ ఆలోచన చేస్తోంది. అంటే ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12 అన్నమాట. ఈ లెక్కన ఒకే బంతికి 12 పరుగులు చేసే వీలు బ్యాట్స్మన్కు కలుగుతుంది.
వీటితో పాటు చిన్న చిన్న మార్పులు కూడా చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. నోబాల్ను ఫాల్ట్ అని, డాట్ బాల్ను ఏస్ను అని పిలవనున్నట్లు ఐసీసీ చెప్పింది.