
హైదరాబాద్: ఆసియా కప్ కోసం శనివారం సెలక్టర్లు భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. 15మందితో కూడిన జట్టులో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఇటీవలే యో-యో టెస్టులో ఫిట్నెస్ నిరూపించుకున్న అంబటి రాయుడికి చోటు దక్కగా, మనీష్ పాండేకి కూడా సెలక్టర్లు చోటు కల్పించారు.
వర్క్లోడ్ కారణంగా.. వెస్టిండిస్, ఆస్ట్రేలియాలతో సిరీస్ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 158 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీని పాక్ పేసర్ అమీర్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఏకపక్షంగా సాగిన ఆ మ్యాచ్లో అమీర్, హసన్ అలీ తలో మూడు వికెట్లు తీసి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం అమీర్ అద్భుతమైన బంతితో తనను ఔట్ చేశాడని కోహ్లీ కూడా అంగీకరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అమీర్ తనను మళ్లీ ఆసియా కప్లో ఔట్ చేస్తాడని కోహ్లీ ఆసియా కప్కి దూరం అవుతున్నాడు అనే అర్థం వచ్చేలా ట్వీట్లు పెడుతున్నారు.
పాక్ అభిమానుల ట్వీట్కు భారత క్రికెట్ అభిమానులు అంతే ఘాటుగా బదులిస్తున్నారు.