
హైదరాబాద్: అంధుల ప్రపంచ కప్ పోటీలో భారత్ గెలిచింది. ఇది మొదటి సారి కాదు ఇంతకుముందు కూడా ప్రపంచ కప్ను గెలుచుకుంది. అంతగా ప్రజాదరణకు నోచుకోకపోయిన విజయాలకు మాత్రం ఏ మాత్రం వెనుకాడటం లేదు. భారత అంధుల క్రికెట్ జట్టు. ఇప్పటిదాకా అంధుల క్రికెట్లో ఐదు ప్రపంచకప్లు జరిగాయి. వీటిలో తొలి టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాతి రెండుసార్లు పాకిస్థాన్ ఛాంపియన్ అయింది. ఆఖరి రెండు సార్లు భారతే ప్రపంచ విజేతగా నిలిచింది.
ఒకసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి వరుసగా రెండో సారి అంధుల ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత జట్టుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలియజేశారు. ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు.
'మీ ఆటతో, గొప్ప దృక్పథంతో దేశం గర్వించేలా, ప్రతి భారతీయుడూ స్ఫూర్తి పొందేలా చేశారు. మీరు నిజమైన ఛాంపియన్లు' అని మోదీ అన్నారు. 'అంధుల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. జట్టు తమ నైపుణ్యాలను, పట్టుదలను, ఆత్మవిశాస్వాన్ని ప్రదర్శించింది. మీరు సాధించిన విజయానికి జాతి గర్విస్తోంది' అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
'పెద్దలన్నట్టుగా సంకల్ప బలం ఉంటే విజయం దానంతటదే సిద్ధిస్తుంది. భారత జట్టుకు ప్రణామం. అంధుల ప్రపంచకప్ గెలిచినందుకు మొత్తం జట్టు సభ్యులందరికీ అభినందనలు' అని సచిన్ ట్వీట్ చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ సైతం ట్విటర్లో అభినందనలు తెలియజేశారు.
శనివారం షార్జాలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. 308 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 10 బంతులు మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సునీల్ రమేష్ (62 బంతుల్లో 93), కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి (60 బంతుల్లో 62) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు వెంకటేష్ (32 బంతుల్లో 35), ప్రకాష్ (42 బంతుల్లో 44) ఛేదనలో భారత్కు మెరుపు ఆరంభాన్నిచ్చారు. మధ్యలో భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డప్పటికీ సునీల్, అజయ్ అద్భుత పోరాటంతో జట్టును గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.