
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఓవల్ వేదికగా భారత్తో జరిగిన టెస్టు ఆ జట్టు ఓపెనర్ అలెస్టర్ కుక్కి ఆఖరి టెస్టు. తన కెరీర్ ఆఖరి టెస్టులో విజయంతో ఘనంగా ముగించాడు కుక్. అయితే, ఈ టెస్టులో రిషబ్ పంత్ చేసిన సెంచరీ కుక్ వీడ్కోలుని పాడు చేసేలా అనిపించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
464 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114) సెంచరీలతో గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఒకానొక దశలో అనూహ్య ఫలితమూ వచ్చేలా కనిపించింది.
ఆరో వికెట్కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది. కీలక సమయంలో ఆదిల్ రషీద్ (2/63) చక్కటి బంతితో రాహుల్ను ఔట్ చేసి భారత్ ఆశలకు తెరదించాడు. ఆ వెంటనే పంత్నూ పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు.
17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 345 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (3/45), శామ్ కర్రన్ (2/23) రాణించారు.
ఈ మ్యాచ్లో టీ విరామానికి కేఎల్ రాహుల్-రిషబ్ పంత్ జోడీ 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అదే టీ విరామం అనంతరం ఏడో ఓవర్లోనే రషీద్ దెబ్బకొట్టాడు. 82వ ఓవర్ తొలి బంతికి రాహుల్ను ఓ అద్భుత బంతికి రషీద్ బోల్తా కొట్టించాడు. వికెట్ ముందున్న రఫ్ ప్యాచ్లో పడిన బంతి అనూహ్యంగా మలుపు తిరిగింది.
బ్యాక్ ఫుట్ ఆడాలనుకున్న రాహుల్ను తప్పిస్తూ బంతి ఆఫ్ స్టంప్ను పడగొట్టింది. దీంతో ఆరో వికెట్కు 204 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, వీరిద్దరూ ఔట్ కాకుండా చివరి వరకు క్రీజులో ఉండి లక్ష్యాన్ని చేధించి ఉన్నట్లైతే అది ఇంగ్లీషు గడ్డపై ఓ చరిత్రగా నిలిచిపోయేది.