ధర్మశాల: హార్ధిక్ పాండ్యా ధర్మశాల వన్డే తర్వాత క్రీడా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా ట్వంటీ20 జట్టులో అద్బుతమైన ప్రదర్శనలు చేసిన పాండ్యా ధర్మశాల వన్డేతో అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
అంతేకాదు అరంగేట్ర వన్డేలోనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్న నాలుగో భారతీయ ఆటగాడిగా హార్ధిక పాండ్యా అరుదైన రికార్డుని నమోదు చేశాడు. గతంలో సందీప్ పాటిల్, మోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్తో సిరిస్కు ముందు భారత 'ఎ' జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ను ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7 మ్యాచ్లలో కేవలం 47 పరుగులే చేసి 5 వికెట్లు తీసి సెలక్టర్లను సంతృప్తి పరచలేకపోయాడు. అయినా సరే ఆల్ రౌండర్ అయిన పాండ్యాపై ధోని నమ్మకముంచి మరో అవకాశాన్ని ఇచ్చాడు. దీంతో ఆదివారం ధర్మశాలలో జరిగిన తొలి వన్డే పాండ్యాకు తొలి వన్డే.

భారత్ తరుపున వన్డేలు ఆడిన 215వ క్రికెటర్గా పాండ్యా గుర్తింపు తెచ్చుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లో టీమిండియా మాజీ క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ టీమ్ క్యాప్ను పాండ్యాకు అందజేశారు. 38 ఏళ్ల క్రితం ఆదివారం (అక్టోబర్ 16)న తొలి టెస్టు ఆడిన కపిల్ దేవ్ నుంచి టోపీ అందుకోవడం పట్ల పాండ్యా అమితానందం వ్యక్తం చేశాడు.
భారత్ Vs న్యూజిలాండ్ ధర్మశాల వన్డే చిత్రాలు
ఇక పేసర్లకు అనుకూలించే ధర్మశాల మ్యాచ్ పాండ్యాకు అనుకూలించింది. కొత్త బంతిని బుమ్రాని కాదని ఉమేశ్, పాండ్యా జోడీకి ఇచ్చాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని ఎంతగానో పాండ్యా సద్వినియోగ పరచుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో ప్రమాదకర గుప్తిల్, అండర్సన్, రాంకిలను ఔట్ చేశాడు.
అంతేకాదు ధర్మశాల వన్డే మ్యాచ్లో నిలకడగా 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా అవార్డుని అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం పాండ్యా మీడియాతో మాట్లాడాడు. అరంగేట్ర మ్యాచ్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు.
కాగా అరంగేట్ర వన్డే మ్యాచ్లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హార్ధిక్ పాండ్యా ట్విట్టర్లో ప్రశంసలు అందుకుంటున్నాడు.