కరాచీ: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇరుదేశ అభిమానులకు పండగే. ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా సాగే ఈ మ్యాచ్లను చూసేందుకు ఇరుదేశాల అభిమానులు అమితాసక్తి చూపుతారు.
తమ తమ జట్ల తరపున నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా తిలకిస్తారు. మ్యాచ్ గెలిచిన అనంతరం టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకుంటారు.
అయితే, ఈ దాయాదుల మ్యాచ్ అంటే మాత్రం హృద్రోగుల(గుండె సంబంధిత రోగుల)కు ప్రమాదకరమట. ఈ మేరకు పాకిస్థాన్లోని గుర్జాన్వాలా నగర వైద్యులు చెబుతున్నారు.
అంతేగాక, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ను రోగులకు దూరం చేశారు. ఈ సందర్భంగా ఆ ఉద్వేగం, ఉత్కంఠను గుండె జబ్బులున్నవారు చూసి తట్టుకోలేరంటూ రోగులను మ్యాచ్ చూడకుండా చేశారు.
ఆస్పత్రిలోని వార్డుల్లో నుంచి టీవీలను తాత్కాలికంగా తొలగించారు. 'భారత్, పాక్ మ్యాచ్లో ఉత్కంఠ, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. హృద్రోగులకు అది ఏమాత్రం మంచిది కాదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకోలేదు. అందుకే టీవీలు తీసేశాం' అని సీనియర్ హార్ట్ సర్జన్ మటీన్ చెప్పడం గమనార్హం.