
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్ను ఎదుర్కొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో మ్యాచ్ కొనసాగుతోంది. అందరూ ఆశించినట్టుగా టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ప్రారంభ ఓవర్లల్లోనే వికెట్ను కోల్పోయింది. మూడో ఓవర్లోనే వికెట్ పడింది. కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. తక్కువ స్కోర్కే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓపెనర్ కమ్ కేప్టెన్ రోహిత్ శర్మ, ఫస్ట్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్ను ఆరంభించారు. మూడో ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ బలి అయ్యాడు. పాల్ వాన్ మీకెరెన్ వేసిన ఓవర్ అది. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని ఫ్లిక్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు రాహుల్. అది నేరుగా ప్యాడ్స్ను తాకింది. దీనితో బౌలర్ మీకెరెన్, వికెట్ కీపర్ స్కాట్ ఎడ్వర్డ్స్ గట్టిగా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడం, అంపైర్ తన వేలిని పైకెత్తడం చకచకా సాగిపోయాయి.
రివ్యూలో మాత్రం బంతి లెగ్ స్టంప్కు కాస్త దూరంగా వెళ్లిందనేది స్పష్టంగా కనిపించింది. రివ్యూ అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని కోరకుండా కేఎల్ రాహుల్ పెవిలియన్కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఒకవంక నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కేప్టెన్ రోహిత్ శర్మ- రివ్యూ కోరాలని సూచిస్తోన్నప్పటికీ రాహుల్ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పెవిలియన్ దారి పట్టాడు. దీనితో 11 పరుగులకే తొలి వికెట్ను కోల్పోయింది టీమిండియా.
కేఎల్ రాహుల్ రివ్యూ కోరకోవడం, రోహిత్ శర్మ సూచించినప్పటికీ పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు. అవుట్ అయిన కొద్ది సేపటికే భారీగా కామెంట్స్ పడ్డాయి. ఐపీఎల్ వంటి మనీ మేకింగ్ టోర్నమెంట్లల్లో మాత్రమే అతను రాణిస్తాడంటూ మండిపడుతున్నారు. మీమ్స్తో విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్పై మ్యాచ్లోనూ అతను తక్కువ పరుగులకే అవుట్ కావడం, రివ్యూ కోరి ఉంటే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా అలా చేయకపోవడం పట్ల భగ్గుమంటోన్నారు.