హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సోషల్ మీడియాలో ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కింలోని డొక్లామ్లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో గుత్తా జ్వాలాపై కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆమెను 'దేశద్రోహి' అని అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు.
గుత్తా జ్వాలా తల్లిది చైనా. టియాన్జిన్లో ఆమె జన్మించారు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో గుత్తా జ్వాలాకు, నెటిజన్లకు ట్విట్టర్లో మధ్యా మాటల యుద్ధం నడిచింది. మీ తల్లి చైనీస్ కాబట్టే.. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా? అని ఓ అభిమాని జ్వాలాను అడగటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు అని గుత్తా జ్వాలా అతడిని గట్టిగానే హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే... కొద్దిరోజుల క్రితం గుత్తా జ్వాలా ఓ వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో జ్వాలా తన సోదరితో కలిసి పాట పాడుతూ ఉండగా.. వారి తల్లి ఇన్సి గుత్తా కూడా వీడియోలో కనిపిస్తారు.
ఈ వీడియోని చూసిన ఓ అభిమాని 'మీ తల్లి చైనా నుంచి వచ్చారు కనుకే... మీరు ఎల్లప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు కదా' అని ప్రశ్నించాడు. అంతేకాదు ఆ అభిమాని.. మీరు యాంటీ నేషనల్, యాంటీ మోడీ అని ఆరోపించాడు. దీంతో గుత్తా జ్వాలా, ఆ అభిమాని మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది.
గుత్తా జ్వాలా తీవ్ర ఆగ్రహంతో 'ఏదైనా మాట్లాడే ముందు పలుమార్లు ఆలోచించుకో' అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. 'నీపై ఉన్న గౌరవం పోయింది. ఇకపై నా నుంచి నీకు ఎలాంటి సమాధానం లభించదు. నువ్వు ఏదైనా అడగదలుచుకుంటే నేరుగా ప్రశ్నించు. మన మధ్య సంభాషణల్లో నా తల్లిదండ్రుల గురించి ప్రస్తావన తీసుకువస్తే.. నాలో మరో కోణం చూస్తావు. గుర్తుపెట్టుకో' అని పేర్కొంది.