అండర్ 19 టీ20 వరల్డ్ కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తెలుగమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష (44*, 3/15) ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో టీమిండియా వరుసగా రెండోసారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది. అయితే ఈ టోర్నీలో మన అమ్మాయిల అసాధారణ ప్రదర్శనతో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే?
తన సంచలన ఆల్ రౌండ్ ప్రదర్శనతో గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఆసియా కప్లోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది త్రిష.

ఈ టీనేజ్ సెన్సేషన్ 110 పరుగులు చేసి.. మహిళల అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో మూడంకెల స్కోరు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచింది. తద్వారా సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గానూ నిలిచింది. ప్రస్తుత టోర్నీలోనూ శతకం బాదిన ఏకైక క్రికెటర్ కూడా ఆమెనే కావడం విశేషం. ఈ టోర్నీలోని అన్ని మ్యాచుల్లో వరుసగా 4,27,49,40,110,35,44 స్కోర్లు చేసింది త్రిష. మొత్తంగా 77.25 సగటుతో 309 పరుగులు సాధించి.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ చెలరేగి, 7 వికెట్లతో అదరగొట్టింది. సానికా చాల్కే.. 95 యావరేజ్ తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
45 బౌండరీలతో ఈ టోర్నీలో అత్యధిక పోర్లు బాదిన క్రికెటర్ గానూ నిలిచింది త్రిష. అలానే 5 సిక్స్ లు బాది అత్యధిక సిక్స్ లు బాదిన జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో కమిలిని అత్యధిక హాఫ్ సెంచరీలు (2) బాదిన ప్లేయర్ గా నిలిచింది.
బౌలింగ్ లో.. వైష్ణవి శర్మ 17 వికెట్లతో టాప్ లో ఉండగా, 14 వికెట్లతో ఆయూషీ శుక్లా రెండో స్థానంలో నిలిచింది. వీరిలో వైష్ణవి మలేషియాపై ఒకే ఇన్నింగ్స్ లో నమోదు చేసిన 5/5.. టోర్నీలోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కావడం విశేషం. అలానే ఎకామనీ విషయంలో వైష్ణవి.. శ్రీలంకపై నాలుగు ఓవర్లలో 3 పరుగులే ఇచ్చి టాప్ లో నిలిచింది. మరోవైపు అత్యధిక మెయిడెన్ ఓవర్లు (4) వేసిన బౌలర్ గా నిలిచింది ఆయూషీ. అలానే అత్యధిక డాట్ బాల్స్ (111) బౌలర్ గా రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ జాబితాలో పరునికా సిసోడియా (86 డాట్ బాల్స్) రెండో స్థానంలో నిలవగా.. వైష్ణవి 83 డాట్ బాల్స్ తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక స్కాట్లాండ్ పై 150 పరుగుల తేడాతో గెలుపొంది.. ఈ టోర్నీలో టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.