
పక్కా ప్రణాళికతోనే ఔట్ చేసాం:
రెండో ఇన్నింగ్స్లో కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (19), టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారా (11), పృథ్వీ షా (14), అజింక్య రహానే (29) వికెట్లను బౌల్ట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే పక్కా ప్రణాళికతోనే కోహ్లీని బోల్తా కొట్టించామని బౌల్ట్ పేర్కొన్నాడు. 'కోహ్లీకి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోతే కచ్చితంగా బౌండరీల మోత మోగిస్తాడు. షార్ట్ బంతులతో కోహ్లీని అడ్డుకోవాలనుకున్నాం. అంతేకాదు రన్రేటు తాగిస్తే అతడిని అడ్డుకోగలమని భావించాం. ఈ ప్లాన్తోనే కోహ్లీని పెవిలియన్కు చేర్చాం' అని బౌల్ట్ తెలిపాడు.

కోణాలు మారుస్తూ బంతులేయాలి
'కైల్ జేమీసన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి చక్కని స్పెల్ వేశాడు. కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో షార్ట్ బంతులతో అతడిని వెనక్కి పంపాం. బేసిన్ రిజర్వ్ మైదానంలో ఆడిన అనుభవం ఎక్కువ ఉండటం నాకు కలిసొచ్చింది. ఇక్కడ గాలి ఎక్కువగా ఉంటుంది. దానిని గమనిస్తూ బౌలింగ్ చేయాలి. కివీస్లో రెడ్ బాల్ అంతగా స్వింగ్ అవ్వదు. క్రీజుని ఉపయోగించుకుని కోణాలు మారుస్తూ బంతులు వేయాలి. ఇక్కడి పరిస్థితులను బట్టి ఎరౌండ్ ది వికెట్ వేయడం మంచిది. రెండో ఇన్నింగ్స్లో కీలక వికెట్లు తీసినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని బౌల్ట్ పేర్కొన్నాడు.

బౌండరీలతో హోరెత్తించిన బోల్ట్
తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే కోహ్లీసేన చాపచుట్టేయగా.. కివీస్ 348 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. అయితే ఈ స్కోరులో కివీస్ టెయిలెండర్ల పరుగులే కీలకం. జేమీసన్ (45 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్స్లు) మరోసారి చెలరేగాడు. 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన బౌల్ట్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో హోరెత్తించాడు. చివరకు ఇషాంత్ అతన్ని ఔట్ చేసాడు. బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా బోల్ట్ సత్తా చాటాడు.

10 వికెట్లతో ఘన విజయం
తొలి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య కివీస్ 10 వికెట్లతో ఘన విజయం సాధించింది. కివీస్ మరో రోజు మిగిలుండగా.. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఆట ముగించడం గమనార్హం. 9 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 1.4 ఓవర్లలోనే లాంఛనాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 7 పరుగులు, టామ్ బ్లండెల్ 2 పరుగులు సాధించి కివీస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.


Click it and Unblock the Notifications

