పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు మొదలయ్యాయి. రెండు రోజుల వ్యవధిలోనే కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు వరుసగా రాజీనామాలు చేశారు. బోర్డు చైర్మన్ జకా అష్రఫ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతకుముందు పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ తమ పదవులకు రాజీనామా చేసి షాకిచ్చారు.
ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం పాకిస్థాన్ క్రికెట్లో అలజడులు తీవ్ర స్థాయికి పెరిగాయి. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్లో ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ తప్పుకుంటున్నట్టు బాబార్ అజామ్ ప్రకటించాడు. అయితే ప్రపంచకప్లు ముగిసిన అనంతరం తమ కెప్టెన్ల మార్చడం పాకిస్థాన్కు కొత్తేమి కాదు. ప్రక్షాళన పేరుతో గతంలో ఎన్నో సార్లు ఇలా చేసింది.

కానీ ఈ సారి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కొత్త కెప్టెన్లను నియమిస్తున్నట్లు పాకిస్థాన్ బోర్డు ప్రకటించింది. టెస్టు బాధ్యతలు షాన్ మసూద్కు అప్పగించింది. కొత్త ఉత్సాహంతో మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టుకు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయింది. మరోవైపు షాహిన్ అఫ్రిది కెప్టెన్సీలో టీ20 జట్టు ప్రదర్శన కూడా తీసికట్టుగా ఉంది. న్యూజిలాండ్తో జరగుతున్న అయిదు టీ20ల సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరగగా అన్నింట్లోనూ ఓటమిపాలైంది.
జట్టుతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోనూ తీవ్ర సమస్యలు ఉన్నాయని వరుస రాజీనామాలతో మరోసారి తెలుస్తోంది. గతేడాది జులైలో చైర్మన్ బాధ్యతలు అందుకున్న జకా అష్రఫ్పై బోర్డు సభ్యుడు ఒకరు గతంలో ఫిర్యాదు చేశాడు. తప్పులు చేస్తున్నాడని, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించాడు. అంతేగాక బాబర్ అజామ్ విషయంలో అష్రఫ్ వైఖరి బాగాలేదని గతంలో పాకిస్థాన్ మాజీలు వ్యాఖ్యానించారు. అయితే నవంబర్లోనే అష్రఫ్ పదవీ కాలం పూర్తియినప్పటికీ మరో మూడు నెలల పొడగింపు అనుమతి దక్కించుకున్నాడు. కానీ బోర్డు మీటింగ్ అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.