స్కాట్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు స్కాట్లాండ్పై ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పవర్ప్లేలో ఏకంగా 113 పరుగులు బాది ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లోనే 80 పరుగులు బాదాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (39; 12 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడటంతో ఆసీస్ 5.3 ఓవర్లలోనే మూడంకెల స్కోరు అందుకుంది. వీరిద్దరు కలిసి వరుసగా 14 బౌండరీలు బాదడం విశేషం.

నాలుగో ఓవర్ చివరి రెండు బంతుల్ని హెడ్ ఫోర్, సిక్సర్గా మలిచాడు. అనంతరం అయిదో ఓవర్లో మార్ష్ వరుసగా 6, 6, 4, 6, 4, 4 బాదాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో హెడ్ విశ్వరూపం చూపించాడు. తొలి బంతిని బౌండరీ బాది 17 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పవర్ప్లేలో చివరి అయిదు బంతుల్ని 6, 4, 4, 4, 4గా బాదాడు. అయితే ఏడో ఓవర్లో మార్ష్, హెడ్ వికెట్లు కోల్పోయారు.
జోష్ ఇంగ్లిష్ (27 నాటౌట్; 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), స్టొయినిస్ (8 నాటౌట్; 5 బంతుల్లో, 1 సిక్సర్) మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్తో టీ20ల్లో అరంగేట్రం చేసిన ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ మూడు బంతుల్ని ఎదుర్కొని డకౌటయ్యాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ మున్సె (28; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో అబాట్ మూడు, జేవియర్, జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.