పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా 295 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే భారత్తో పాటు ఆసీస్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాను 150 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ.. భారత బౌలర్ల ముందు తమ బ్యాటర్లు నిలవలేక మ్యాచ్పై ఆస్ట్రేలియా పట్టు చేజార్చుకుంది.
ఇక రెండో ఇన్నింగ్స్లో యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలు బాదడంలో బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక బ్యాటర్లు చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టులో విజయం సాధించి అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆధిక్యాన్ని సమం చేయాలని ఆస్ట్రేలియా ఉవ్విళూరుతోంది. డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

ఈ నేపథ్యంలో అడిలైడ్ లోకల్ బాయ్ ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ... జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ''అత్యంత గొప్ప బౌలర్గా బుమ్రా ఎదుగుతున్నాడు. అతనితో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం. అతనికి వ్యతిరేకంగా ఆడటం గొప్ప విషయం. వెనక్కి తిరిగి చూసి..కెరీర్లో బుమ్రాను ఎదుర్కొన్నామని మనవళ్లతో చెప్పడం ఎంతో బాగుంటుంది. మరికొన్ని సార్లు మాత్రమే అతన్ని సవాల్గా ఎదుర్కోవాలని ఆశిస్తున్నా'' అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.

గాయం కారణంగా హేజిల్వుడ్ దూరమవ్వడం తమ జట్టుకు ప్రతికూలాంశమని ట్రావిస్ హెడ్ అన్నాడు. పక్కటెముకుల గాయం కారణంగా రెండో టెస్టుకు హేజిల్వుడ్ దూరమైన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ట్రావిస్ హెడ్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ సత్తాచాటలేకపోయారు. రెండో ఇన్నింగ్స్లో హెడ్ 101 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కాగా, బుమ్రా తొలి ఇన్నింగ్స్లో అయిదు, సెకండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశాడు.