
సిడ్నీ: కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సీఏ దృష్టంతా భారత్పైనే ఉంది. ఈ ఏడాది చివరిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఉంది. కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వైరస్ వైరస్ బారిన పడకుండా సిరీస్ నిర్వహణపై చాలా విధాలుగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆలోచిస్తోంది.
ఖాళీ మైదానంలో మ్యాచ్లను నిర్వహించడంతో పాటు సిరీస్ మొత్తాన్ని ఒకే వేదికలో నిర్బహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అడిలైడ్ వేదికగా అన్ని టెస్టులు జరపాలని సీఏ చూస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆసీస్ వైస్ కెప్టెన్ ట్రావిస్ హెడ్ మద్దతు తెలిపాడు. ఒకే వేదికపై సిరీస్ నిర్వహణ మంచి ఆలోచన అని ప్రశంసించాడు. అడిలైడ్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వరుసగా నాలుగు మ్యాచ్లను నిర్వహించే సత్తా వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (వాకా)కు ఉందని హెడ్ పేర్కొన్నాడు.
'ఖాళీ మైదానంలో మ్యాచ్లను నిర్వహించడం అందరికి సురక్షితం. సిరీస్ మొత్తాన్ని ఒకే వేదికలో నిర్బహించాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఆలోచన సరైనదే. మ్యాచ్ల కోసం వివిధ వేదికలకు ప్రయాణం, ఇతర సమస్యల వల్ల ఒకే చోట మొత్తం సిరీస్ను నిర్వహిస్తే బాగుంటుంది. అడిలైడ్లో అన్ని వసతులు ఉన్నాయి. వరుసగా నాలుగు మ్యాచ్లను నిర్వహించే కెపాసిటీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘంకు ఉంది. అక్కడి పిచ్ చాలా బాగుంటుంది' అని ట్రావిస్ హెడ్ అన్నాడు.
'గతంలోనూ ఇలా చేసారు. అడిలైడ్లో దేశవాళీ మ్యాచ్లు, రగ్బీ మ్యాచ్లు, వివిధ కన్సర్ట్లను వెంటవెంటనే నిర్వహించారు. అవి విజయవంతం అయ్యాయి. క్యూరేటర్ చక్కగా వికెట్ సిద్ధం చేయగలడు. ఇక స్టేడియంలో ఒక హోటల్ను కూడా నిర్మించారు కాబట్టి ఆటగాళ్ల వసతికి ఢోకా ఉండదు' అని హెడ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెటర్లు రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండటానికి సిద్ధమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే తెలిపింది.
ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నసీఏ మళ్లీ గాడిన పడాలంటే.. భారత్ పర్యటన ఒక్కటే మార్గమంటున్నారు ఆ దేశ క్రికెటర్లు. భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తే ఆర్థికంగా ఏర్పడ్డ నష్టాలను సీఏ పూడ్చుకోగలుగుతుందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ పేర్కొనగా.. ఆ దేశ యువ స్ సంచలనం మార్నస్ లబుషేన్ ఇదే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ నిర్ణీత షెడ్యూల్లో భారత జట్టు పర్యటనకు రాకపోతే.. అది ఆర్థికపరమైన వినాశానికి దారి తీస్తుందన్నాడు.
సంక్షోభం నుంచి బయటపడటం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా జూన్ వరకు కొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలిగిస్తున్నామని సీఏ ప్రకటించింది. అయితే అప్పటివరకు వారి ఉపాధి కోసం తమ స్పాన్సర్లలో ఒకరైన ఊల్వర్త్స్ సూపర్ మార్కెట్లో ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కెవిన్ రాబర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపారు.