మహారాష్ట్రలోని పుణెలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. క్రికెటర్ గుండెపోటుతో మైదానంలోనే మరణించాడు. గార్వేర్ స్టేడియంలో గురువారం ఈ సంఘటన జరిగింది. వివరాళ్లోకి వెళ్తే..35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చాడు. కాసేపు సజావుగానే బ్యాటింగ్ చేశాడు. సాధికారికంగా పరుగులు సాధించాడు. అయితే ఈ క్రమంలో బౌండరీ బాదిన అనంతరం ఇమ్రాన్ ఛాతిలో నొప్పి వచ్చింది.
వెంటనే పిచ్పై కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాడు. మరోవైపు డగౌట్లో ఉన్న తన సహచరులకు హెల్మెట్ తీసుకోని రమ్మని కూడా చెప్పాడు. అయితే ఛాతితో పాటు చేయి కూడా విపరీతంగా నొప్పి రావడంతో అంపైర్లకు ఈ విషయాన్ని తెలియచేశాడు. అంపైర్లతో పాటు ప్రత్యర్థి జట్టు కెప్టెన్తో కూడా తన పరిస్థితిని వివరించాడు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పటేల్ మైదానాన్ని వీడటానికి అంపైర్లు అనుమతి ఇచ్చారు.

అయితే పెవిలియన్ బాట పట్టిన ఇమ్రాన్ పటేల్ కొద్ది దూరం అడుగులు వేసిన వెంటనే కుప్పకూలిపోయాడు. అంపైర్లు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లంతా అతని వైపు పరుగులు పెట్టారు. ఇమ్రాన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరిశీలించి ఇమ్రాన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉంటాడని, గతంలో ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని సహచర ఆటగాళ్లు పేర్కొన్నారు.
కాగా, ఇమ్రాన్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు వయస్సు నాలుగు నెలలు మాత్రమే. ఇమ్రాన్ పటేల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాగా, పుణెలో రెండు నెలల క్రితం హబీబ్ షేక్ అనే వ్యక్తి కూడా క్రికెట్ ఆడుతూ మరణించాడు. అయితే హబీబ్కు మధుమేహం ఉంది.