టీ20 వరల్డ్ కప్ భారత్ విజయం సాధించడంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ది ప్రధాన పాత్ర. ప్రత్యర్థిని ఓడించడానికి అతను మైదానంలో మాత్రమే దిగలేదు. కానీ మిగిలిన పనంతా తెరవెనుక నడిపించిందే ద్రవిడే. ప్రణాళికలు రచించడంలో, జట్టుకూర్పు విషయాల్లో ద్రవిడ్ తీసుకున్న నిర్ణయాలు టీమిండియాను జగజ్జేతగా నిలిపేలా చేశాయి.
మొత్తంగా తన ఆఖరి మిషన్ టీ20 వరల్డ్ కప్-2024ను ద్రవిడ్ విజయవంతంగా ముగించాడు. ఈ మెగాటోర్నీ అనంతరం భారత జట్టు కోచ్ పదవికి ద్రవిడ్ గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. 2021 నవంబర్లో ద్రవిడ్ టీమిండియా కోచ్గా బాధ్యతలు అందుకున్నాడు. గత వన్డే వరల్డ్ కప్తోనే ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కానీ, ఈ టీ20 ప్రపంచకప్ వరకు కోచ్గా ఉండాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ కొనసాగాడు.

అయితే కోచ్గా తాను తీసుకున్న కఠిన నిర్ణయాలు ద్రవిడ్ వెల్లడించాడు. కోవిడ్ అనంతరం బాధ్యతలు అందుకున్నాని, ఆ సమయం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పాడు. ''అప్పుడే కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. దీంతో ఆటగాళ్లపై నిబంధనలు ఎక్కువ అయ్యాయి. మరోవైపు అన్ని ఫార్మాట్లతో ఆటగాళ్ల పనిభారాన్ని చూసుకోవాల్సి వచ్చింది. అంతేగాక జట్టులో కొందరు ప్లేయర్లు గాయపడ్డారు. కోచ్గా నా తొలి ఎనిమిది నుంచి పది నెలల్లో అయిదు లేదా ఆరుగురు భారత జట్టుకు కెప్టెన్సీ వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నేను ప్లాన్ చేయలేదు. అలా జరిగిపోయింది''
''కొవిడ్ ముగిసిన తర్వాత మేం ఎక్కువ సిరీస్లు ఆడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రెండు జట్లను పంపించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గత రెండున్నర ఏళ్లుగా వైట్బాల్ క్రికెట్లో ఎంతో మంది యువకులకు అవకాశం ఇచ్చాం. అంతర్జాతీయ క్రికెట్కు యువ క్రికెటర్లు అలవాటు పడిన తీరు, వాళ్ల ప్రదర్శన ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారిలో కొందరు ఆటను మెరుగుపర్చుకుని, ఎక్కువకాలం జట్టులో కొనసాగారు. సీనియర్లకు గాయాలవ్వడం వల్ల మరికొందరు జట్టులో కొనసాగాల్సి వచ్చింది''
''అయితే కష్టతరమైన విషయం ఏంటంటే.. చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో మూడు ఫార్మాట్లను రెగ్యులర్గా ఆడటానికి కొందరినే ఎంపిక చేయాల్సి వచ్చింది. ఇది కోచ్గా నేను తీసుకున్న కఠినమైన నిర్ణయాల్లో ఒకటి'' అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.