న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఆదాయ వ్వయాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబితాలో ఎప్పటిలాగే ఈసారి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటి స్థానంలో నిలిచింది.
2016 సంవత్సరానికి గాను బీసీసీఐ అగ్రస్ధానంలో నిలవగా... న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పదో స్ధానంలో నిలిచింది. ఈ ఏఢాది బీసీసీఐ ఆదాయం రూ. 1070 కోట్ల 52 లక్షలగా ఉంది. భారత్లో క్రికెట్ను ఓ మతంలాగా ఇక్కడి అభిమానులు భావిస్తారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రేజ్ బీసీసీఐకి భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. మ్యాచ్ టికెట్ల అమ్మకాలు, టీవీ హక్కులు, ఇంటర్నెట్ వంటి వాటి ద్వారా ఆదాయంతో పాటు టోర్నమెంట్, మ్యాచ్ గెలవడం ద్వారా వచ్చే రాబడి, టోర్నమెంట్లకు స్పాన్సర్షిప్ అమ్మకం లాంటి వాటి ద్వారా బీసీసీఐ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

వీటితో పాటు భారత జట్టు ధరించే జెర్సీలపై కూడా ప్రకటనల కోసం డబ్బు వసూలు చేస్తోంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా బీసీసీఐకి అధిక మొత్తంలో కాసుల వర్షం కురిపిస్తోంది. బీసీసీఐ తర్వాత రెండో స్ధానంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) ఉంది.
సౌతాఫ్రికా 461 కోట్లు ఆర్జిస్తుండటం విశేషం. ఆ తర్వాత ఇంగ్లండ్ రూ.394 కోట్లు, పాకిస్థాన్ రూ.367 కోట్లు, బంగ్లాదేశ్ రూ.360 కోట్లు, జింబాబ్వే రూ. 213 కోట్లు, ఆస్ట్రేలియా రూ.160 కోట్లు, శ్రీలంక రూ. 113 కోట్లు, వెస్టిండిస్ రూ.100 కోట్లు, న్యూజిలాండ్ రూ.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
టాప్ 10 సంపన్నమైన క్రికెట్ బోర్డుల జాబితా:
* బీసీసీఐ : రూ. 1070 కోట్లు
* సౌతాఫ్రికా : 461 కోట్లు
* ఇంగ్లండ్ : 394 కోట్లు
* పాకిస్తాన్: 367 కోట్లు
* బంగ్లాదేశ్ : 360 కోట్లు
* జింబాబ్వే : రూ. 213 కోట్లు
* ఆసీస్ : రూ.160 కోట్లు
* శ్రీలంక : రూ. 113 కోట్లు
* విండీస్ : రూ.100 కోట్లు
* కివీస్ : రూ.60 కోట్లు