హైదరాబాద్: తాను క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కరేనని చెప్పుకొచ్చాడు యువ పేసర్ దీపక్ చాహార్. ఐపీఎల్ 11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్లో దీపక్ చాహార్ చేసిన అద్భుత ప్రదర్శన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరిస్కు ఎంపికయ్యేలా చేసింది. సచిన్ను కలిసిన తర్వాతే తాను క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం జరిగిందని చాహార్ పేర్కొన్నాడు. తొలుత నెట్స్లో సచిన్కు బౌలింగ్ వేశానని, ఆ తర్వాత తాను పూర్తిస్థాయి బౌలర్గా మారినట్లు చెప్పుకొచ్చాడు.
"నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి సచిన్ను చూస్తునే పెరిగాం. మిగతా యువ క్రికెటర్ల లాగే. సచిన్ పాజీని చూసిన తర్వాత నేను క్రికెట్ను నా కెరీర్గా ఎంచుకున్నా. ఇప్పటికీ సచినే నాకు ప్రేరణ" అని పేర్కొన్నాడు.
"2005లో ఓ మ్యాచ్ కోసం సచిన్ జైపూర్కి వచ్చాడు. అప్పుడు సచిన్కు నెట్స్లో బౌలింగ్కు వేసేందుకు ఎంపిక చేసిన బౌలర్లలో నేను ఒకడిని. నెట్స్లో బౌలింగ్కు ముందు సచిన్కు కొన్ని త్రో-డౌన్స్ వేశాను. సచిన్కు బౌలింగ్ చేయడం ఇప్పటికీ తన జీవితంలో ఓ మరుపురాని అనుభూతి" అని తెలిపాడు.
ఐపీఎల్ 11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంతో దీపక్ చాహార్ కూడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడే సమయంలో ధోనిని అతి దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
"ఐపీఎల్ సమయంలో ధోనితో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. తొలిసారి ధోనిని రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ క్యాంప్లో కలిశాను. ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో తొలిసారి ధోని భాయ్ను కలిశాను. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోని మైదానంలో అడుగుపెట్టాడు" అని తెలిపాడు.
"ఆ మ్యాచ్లో నేను గాయపడ్డాను. ఆ సమయంలో ధోని నా వద్దకు వచ్చిన గాయం గురించి వాకబు చేశాడు. అంతేకాదు గాయం నుంచి ఎలా కోలుకోవాలో కూడా సలహా ఇచ్చాడు" అని చెప్పుకొచ్చాడు.