
దుబాయ్: సోమవారం రాత్రి చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా.. ఆ తర్వాత బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది.
ఈ ఉత్కంఠ విజయంతో బెంగళూరు అభిమానులు ఆనందంలో తెలియాడుతున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అనుష్క ఓ పోస్టు చేశారు. 'ఓ గర్భిణి.. మ్యాచ్ను ఎంజాయ్ చేసేందుకు ఇంతకన్నా థ్రిల్లింగ్ ఏముంటుంది' అని అనుష్క పేర్కొన్నారు. గర్భిణి అయిన తనకు గత రాత్రి ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అమితానందాన్ని ఇచ్చినట్లు చెప్పారు. ఇన్స్టా స్టోరీలో విక్టరీ మూమెంట్ ఫోటోలతో పాటు బెంగుళూరు సభ్యుల ఫోటోలను కూడా ఆమె పోస్టు చేశారు.
ఐపీఎల్ 2020 కోసం ఆగష్టు 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూఏఈ వెళ్లింది. బెంగళూరు బృందం మొత్తం ప్రత్యేక విమానంలో దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికన్నా ఒక రోజు ముందే దుబాయ్కి వెళ్లాడు. ప్రత్యేక విమానంలో అనుష్కతో కలిసి విరాట్ దుబాయ్ వెళ్లాడు. అనుష్క వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె కోహ్లీతో కలిసి యూఏఈలో ఎంజాయ్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2020 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ విఫలం కావడం వల్ల అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మాజీ క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన ఓ కామెంట్ కూడా తీవ్ర దుమారం రేపింది. కోహ్లీ ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. ఆ వివాదంలో అనుష్క కూడా తడిసిపోయారు. అయితే తాజాగా ముంబైతో మ్యాచ్లో అద్భుత విజయాన్ని కోహ్లీసేన సాధించడంతో అనుష్క ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయారు.
ఐపీఎల్ 2020లో ఇప్పటికి మూడు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 18 పరుగులే చేశాడు. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ 11 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. డిఫెన్సె చేయడానికే తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లీ.. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టాప్ బ్యాట్స్మన్, అది టీ20 మ్యాచ్, తప్పక గెలవాల్సిన పరిస్థితి.. అయినా కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులే చేసి అభిమానులను నిరాశపరిచాడు.