లూయిస్ ఇకలేరు:
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 78 ఏళ్ల టోనీ లూయిస్ బుధవారం మృతి చెందినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. 'లూయిస్ మృతి చెందారని చెప్పడానికి విచారిస్తున్నాం. ఫ్రాంక్ డక్వర్త్తో కలిసి 1997లో ఆయన డక్వర్త్-లూయిస్ విధానాన్ని సృష్టించారు. 1999లో ఐసీసీ ఆ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది' అని ఇంగ్లాండ్ బోర్డు పేర్కొంది. క్రికెట్కు లూయిస్ ఎంతో సేవ చేశారని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్దిస్ అన్నాడు.
1999లో ఆమోద ముద్ర:
డక్వర్త్, లూయిస్ల రిటైర్మెంట్తో స్టీవెన్ స్టెర్న్.. డక్వర్త్ లూయిస్ విధానానికి పర్యవేక్షుడయ్యాడు. దీంతో దాని పేరును ఐసీసీ.. 'డక్వర్త్ లూయిస్-స్టెర్న్'గా మార్చింది. డక్వర్త్ లూయిస్ పద్ధతికి ఐసీసీ 1999లో ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పద్ధతి మాత్రం 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వర్షం కారణంగా మ్యాచ్లు సగంలో ఆగిపోతే.. డక్వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించి విజేతను ప్రకటిస్తారు. అయితే కొన్నిసార్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
లూయిస్, డక్వర్త్ కలిసి:
ఓ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్ అయిన టోనీ లూయిస్, మరో గణాంక నిపుణుడు ఫ్రాంక్ డక్వర్త్తో కలిసి ఓ లెక్క తెచ్చారు. ఓవర్లు, పరుగులు, వికెట్లు, రన్రేట్, తాజా పరిస్థితి అన్నింటిని లెక్కలోకి తీసుకొని ఓ సరైన నిష్పత్తితో గణాంకాలను ఆవిష్కరించారు. ఇది వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన, ఆగి సాగిన ఎన్నో మ్యాచ్లకు ఫలితాన్నిచ్చింది. లూయిస్ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'ఎంబీఈ' పురస్కారంతో సత్కరించింది.
అప్పట్లో మూస పద్ధతి:
డీఎల్ఎస్ రాకముందు అర్ధంతరంగా ఆగే మ్యాచ్ల కోసం ఓ మూస పద్ధతిని అవలంభించేవారు. అప్పటి దాకా ఆడిన ఓవర్లలో అత్యధిక సగటు పరుగుల లెక్కతో విజేతను తేల్చడమో.. లక్ష్యాన్ని నిర్దేశించడమో జరిగేది. 1992లో జరిగిన ప్రపంచకప్లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన అప్పటి విధానం పెను విమర్శలకు దారితీసింది. దీంతో మెరుగైన కొత్త పద్ధతి కోసం ఐసీసీ అన్వేషించగా.. డక్వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి రూపొందించిన పద్ధతి ఐసీసీని మెప్పించింది.