హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య సుధీర్ఘ పర్యటన మంగళవారం నుంచి ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ఐతే భారత జట్టుకు ఎంపికైన స్పీడ్స్టర్ బుమ్రా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయాలతో ఇప్పటికే సిరీస్లకు దూరమయ్యారు. తాజాగా ఇంగ్లాండ్ టీ20, వన్డే జట్టుల్లో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ టామ్ కరన్ పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో అతడు ఇబ్బందిపడుతున్నాడని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) మంగళవారం పేర్కొంది. అతని స్థానంలో అతని సోదరుడు సామ్ కరన్ను టీమ్లోకి తీసుకున్నట్లు ఈసీబీ వెల్లడించింది.
సిరీస్కు కొద్ది రోజుల ముందే గాయానికి లోనైన కరన్.. భారత్తో జరిగే టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడని ఊహించాడు. కానీ, మాంచెస్టర్ వేదికగా జరగనున్న తొలి టీ20కి కూడా అతని ఆరోగ్యం సరిపడకపోవడంతో బోర్డు అతను తుది జట్టులో ఉండబోడంటూ ప్రకటించింది. టామ్ కరన్ ఇప్పటి వరకూ 8 వన్డేలు, 6టీ20లు రెండు టెస్టు మ్యాచ్లు ఆడాడు. సర్రే కప్ ఆడుతున్న సమయంలో రాయల్ వన్డే కప్ గెలుచుకున్నాడు.
అతని స్థానంలో రాబోతున్న సామ్ కరన్ ఇప్పటికే 50ఓవర్ల ఫార్మాట్కు అలవాటుపడి ఉన్నాడు. అయితే ఇతను జట్టులో ఉంటాడని ఊహించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టు జాబితాలో ముందుగానే ఇతని పేరు ప్రకటించింది. ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్ల్లో తలపడనున్నాయి.
మాంచెస్టర్ వేదికగా తొలి టీ20లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొనబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటల నుంచి ప్రారంభంకానుంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయాల పాలు కావడంతో వారి స్థానంలో కృనాల్ పాండ్య, దీపక్ చాహర్కు భారత సెలక్టర్లు వీరికి చోటు కల్పించిన విషయం తెలిసిందే.