
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ యువ బ్యాటింగ్ సంచలనం టామ్ బాంటన్ దుమ్ములేపాడు. ఏకంగా 152 స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్ని దక్కించుకున్నాడు. పాకిస్థాన్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లాడిన బాంటన్.. 137 పరుగులు చేయడంతో కెరీర్ బెస్ట్ ర్యాంక్ని అందుకున్నాడు. ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మంగళవారం రాత్రి మూడు టీ20ల సిరీస్ ముగియగా.. బుధవారం టీ20 ర్యాంకింగ్స్ని ఐసీసీ ప్రకటించింది.
టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తన నెం.1 స్థానాన్ని కాపాడుకోగలిగాడు. బాబర్ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్.. 824 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ (820), కివీస్ ఓపెనర్ కొలిన్ మున్రో (785)లు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ (771) 84 పరుగులు చేయడం ద్వారా.. తొలిసారి టాప్-5లోకి వచ్చాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 673 పాయింట్లతో పదో స్థానానికి పరిమితమవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కోహ్లీ తప్ప బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ టీ20 సిరీస్లో 152 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ని అందుకున్నాడు. దీంతో ర్యాంకింగ్స్లో తాడు 68వ స్థానం నుంచి 44వ స్థానానికి ఎగబాకాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్కి చెందిన యువ సంచలనం రషీద్ ఖాన్ 736 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (730), ఆడమ్ జంపా (712), ఆస్టన్ అగర్ (712), తబ్రేజ్ షంసీ (681)లు టాప్-5లో ఉన్నారు. పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షదాబ్ ఖాన్ ఐదు వికెట్లు పడగొట్టి.. 651 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక ఏడో స్థానంలో పాక్కి చెందిన ఇమాద్ వసీమ్ 665 పాయింట్లతో ఉన్నాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లోనూ అఫ్గాన్కి చెందిన మహ్మద్ నబీ 294 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉన్నాడు. బౌలింగ్, ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ భారత ఆటగాళ్లు ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.