చెన్నై: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా రెండేసి చొప్పున విజయాలతో సమవుజ్జీగా నిలిచాయి. నెట్ రన్రేట్ ఆధారంగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే అయిదో స్థానంలో కొనసాగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ మొదటి రెండు మ్యాచ్ల కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ దూరమైన నేపథ్యంలో మూడో మ్యాచ్ కోసం తుదిజట్టులో మార్పులు చేసింది. అజింక్య రహానేను తీసుకుంది. ఈ గోల్డెన్ ఛాన్స్ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు రహానే. ఇవ్వాళ్టి మ్యాచ్లో కూడా అతణ్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవ్వాళ్టి మ్యాచ్కు మొయిన్ అలీ అందుబాటులోకి రానున్నాడు. ఆల్రౌండర్ స్థానంలో అతణ్ని జట్టులోకి తీసుకుంటే బౌలర్లల్లో ఒకరిని తుదిజట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. డ్వైన్ ప్రిటోరియస్ లేదా సిసండా మలాగాల్లో ఒకరిపై వేటు పడొచ్చు. శ్రీలంకకు చెందిన బౌలర్ మహీష్ తీక్షణ.. జట్టు సెలెక్షన్ కోసం అందుబాటులో ఉన్నప్పటికీ..ఇవ్వాళ్టి మ్యాచ్లో ఆడే అవకాశం దాదాపుగా లేనట్టే.
కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఓ బిగ్ ఇన్నింగ్ను ఆశిస్తోన్నారు అభిమానులు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ ధోనీ ఆడింది తక్కువ బంతులే. ఇన్నింగ్ చివర్లో బ్యాటింగ్కు దిగి తనదైన స్టైల్లో ఫినిష్ చేస్తూ వచ్చాడు. 260 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు ఈ మూడు మ్యాచ్లల్లో. అదే దూకుడుతో ఓ ఫుల్ ప్లెడ్డ్జ్ ఇన్నింగ్ను ఎక్స్పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఆ కోరిక ఇవ్వాళ్టి మ్యాచ్తో నెరవేరుతుందా? లేదా అనేది సస్పెన్స్.
రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఎలాంటి మార్పులు లేకుండా మ్యాచ్లను ఆడింది. పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తోన్న దేవదత్ పడిక్కల్ మాత్రమే తుది జట్టు నుంచి తప్పించింది. ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచిన జట్టుతోనే చెన్నై సూపర్ కింగ్స్పైనా ప్రయోగించడం దాదాపు ఖాయమైనట్టే. తుదిజట్టులో స్పిన్నర్ స్థానం కల్పించాలనుకుంటే ఆడమ్ జంపా లేదా మురుగన్ అశ్విన్ను ఆడించే అవకాశం ఉంది.
సీఎస్కే తుదిజట్టులో- రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, మహీశ్ తీక్షణ, రాజ్వర్ధన్ హగర్గేకర్, డ్వైన్ ప్రీటోరిస్ ఆడొచ్చు. రాజస్థాన్ రాయల్స్లో- జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ ఆడొచ్చు.