దిగ్గజ క్రికెటర్ ధోనీ కెప్టెన్సీలో ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు. భారత క్రికెట్ లో, ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. కెప్టెన్సీలోనే కాకుండా బ్యాటర్ గా రికార్డులు బద్దలు కొట్టాడు. అందుకే ధోనీని 'బెస్ట్ ఫినిషర్', 'కెప్టెన్ కూల్' అంటుంటారు. అయితే ధోనీకి కోపం తెప్పించే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తెలిపాడు.
తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాథ్యూ హేడెన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ లో హేడెన్ చెన్నై తరపున ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. 2008లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ తో హేడెన్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు.

అయితే 'ఎలా ఔటవ్వడం బాధగా అనిపిస్తుంది?' అని హేడెన్ ను ప్రశ్నించగా..నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉండి రనౌట్ అవ్వడం ఎంతో బాధగా ఉంటుందని చెప్పాడు. 'మీ టీమ్ లో వంట ఎవరు బాగా చేస్తారు?' అని అడగగా.. ఆండ్రూ సైమండ్స్ మంచి కుక్ అని సమాధానమిచ్చాడు.
'100 మీటర్ల రేసులో ప్రైమ్ ధోనీ, ప్రైమ్ మైక్ హస్సీ పోటీపడితే ఎవరు గెలుస్తారు?' అనే ప్రశ్నకు.. మైక్ హస్సీ అని హేడెన్ బదులిచ్చాడు. 'ఎన్తిని-హర్భజన్ సింగ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువసార్లు హేడెన్ ను ఔట్ చేస్తారు' అనే క్వశ్చన్ కు హర్భజన్ సింగ్ అని ఆన్సర్ చెప్పాడు.
అలాగే.. 'ఏ ప్లేయర్ తో స్లెడ్జింగ్ సరదాగా అనిపిస్తుంది?' అనే ప్రశ్నకు కూడా స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరును హేడెన్ చెప్పాడు. 'ఛాన్స్ వస్తే ఏ బ్యాటర్ షాట్లు కాపీ కొట్టడానికి ఇష్టపడతావు?' అని అడగగా..
ఏబీ డివిలియర్స్ అని తెలిపాడు. 'ప్రస్తుత ప్లేయర్లలో స్వీప్ షాట్ ఆడే అత్యుత్తమ బ్యాటర్?' అనే ప్రశ్నకు స్కాట్ ఎడ్వర్డ్స్ అని పేర్కొన్నాడు.
'ధోనీకి విసుగు తెప్పించే విషయం ఏంటి?' అనే ప్రశ్నకు ..ఫీల్డింగ్ లో నిర్లక్ష్యం చేస్తే ధోనీకి కోపం వస్తుందని హేడెన్ చెప్పాడు. ఫీల్డింగ్ లో ప్లేయర్లు చురుకుగా లేకపోతే ధోనీ కోపాన్ని చూడాల్సి వస్తుందని, అది మంచిది కాదని పేర్కొన్నాడు.