ప్రస్తుతం క్రికెట్లో టీ20 యుగం నడుస్తోంది. ఈ ఫార్మాట్ ఎక్కువగా బ్యాటర్లకే ఫేవర్గా ఉంటుంది. కానీ బౌలర్లు కూడా సత్తా చాటుతుంటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లు వేసే బౌలర్లకు ప్రత్యేకంగా గుర్తింపు దక్కుతుంది. అదే సమయంలో సరిగా బౌలింగ్ చేయకపోతే అన్ని విమర్శలూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బౌలర్లు కూడా రాటుదేలుతుంటారు.
కానీ తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో జరిగిన ఘటన అందరికీ షాకిచ్చింది. చివరి ఓవర్ బౌలింగ్ చేసే బౌలర్లు సాధారణంగా బెస్ట్ బౌలర్లు అయ్యుంటారు. పిచ్చి పిచ్చి తప్పులు చేయరు. కానీ టీఎన్పీఎల్లో అభిషేక్ తన్వర్ అనే బౌలర్ దారుణంగా బౌలింగ్ చేశాడు. ఎవరైనా చివరి ఓవర్లో 18 పరుగులిస్తారు. కానీ అతను చివరి బంతికి 18 పరుగులిచ్చాడు.

అందుకే ఫ్యాన్స్ అంతా షాకైపోతున్నారు. చివరి ఓవర్లో బంతి అందుకున్న అభిషేక్ తొలి ఐదు బంతులు ఫర్వాలేదనిపించాడు. లాస్ట్ బాల్ యార్కర్ వేశాడు. కానీ అది నోబాల్. దీంతో ఫ్రీహిట్ వచ్చింది. ఈ బంతికి బ్యాటర్ సంజయ్ యాదవ్ భారీ సిక్సర్ బాదాడు. ఇక్కడితో మ్యాచ్ ముగిసింది అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ సిక్సర్ బాదిన డెలివరీ కూడా నో బాల్. దీంతో ఆ బంతికి ఏకంగా ఏడు బంతులు వచ్చాయి.
ఆ తర్వాతి బంతికి సంజయ్ రెండు పరుగులు తీశాడు. కానీ అది కూడా నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. మరుసటి బంతికి అభిషేక్ వైడ్ వేశాడు. ఇక చివరకు లీగల్ డెలివరీ వేసినా.. దానికి సంజయ్ మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఆ బంతికి వరుసగా నోబాల్, సిక్స్ (నోబాల్), 2 (నోబాల్), వైడ్, సిక్స్ వచ్చాయి. అంటే ఆ ఒక్క బంతికే 18 పరుగులు వచ్చాయన్నమాట. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంత చెత్త బాల్ను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.