రంజీ ట్రోఫీలో సెమీఫైనల్లో ముంబై చేతిలో తమిళనాడు ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో తమిళనాడు ఓటమిపాలైంది. అయితే ఓటమికి ప్రధాన కారణం తమిళనాడు కెప్టెన్ సాయి కిశోర్ అని ఆ జట్టు కోచ్ సులక్షన్ కులకర్ణి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడే తమిళనాడు ఓడిపోయిందని పేర్కొన్నాడు. గుర్నాన్ని నీటి వద్దకు తీసుకెళ్లగలమని, కానీ గుర్రమే నీళ్లు తాగాలని ఎద్దేవా చేశాడు. కెప్టెన్, జట్టుపై కోచ్ చేసిన ఈ వ్యతిరేక వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ముంబై 378 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సాయి కిశోర్ చెలరేగడంతో ఓ సందర్భంలో ముంబై 106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ లోయర్ ఆర్డర్లో వచ్చిన శార్దూల్ ఠాకూర్ (109; 104 బంతుల్లో), తనుష్ కొటియన్ (89; 126 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో తమిళ జట్టు 162 పరుగులకే కుప్పకూలింది.

దీంతో కెప్టెన్ సాయి కిశోర్పై కోచ్ కులకర్ణి విమర్శలు గుప్పించాడు. ''నేను సూటిగా మాట్లాడతాను. తొలి రోజు ఉదయం 9 గంటలకే మేం మ్యాచ్ ఓడిపోయాం. వికెట్ను పరిశీలించిన తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో నాకు అర్థమైంది. కోచ్గా, ముంబై వాసిగా ఇక్కడి పరిస్థితులపై అనుభవం ఉంది. మేం టాస్ గెలిచాం. కానీ కెప్టెన్ భిన్నంగా ఆలోచించాడు''
''క్వార్టర్ ఫైనల్లో వేరే పిచ్పై ఆడాం. కానీ ఇది సీమ్కు అనుకూలంగా ఉంటుందని, మ్యాచ్ కఠినంగా సాగుతుందని గ్రహించాను. విజయం సాధించాలంటే బాగా ఆడాలి. కానీ అంతిమంగా బాస్.. కెప్టెన్. నా అభిప్రాయాన్ని, ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వగలను. గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్లగలం. కానీ, గుర్రమే నీళ్లు తాగాలి'' అని కోచ్ కులకర్ణి అన్నాడు.
కోచ్ వ్యాఖ్యలను టీమిండియా, తమిళనాడు క్రికెటర్ దినేశ్ కార్తిక్ తీవ్రంగా తప్పుపట్టాడు. కోచ్ కులకర్ణి వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయని, కోచ్ చాలా పెద్ద తప్పు చేశాడని అన్నాడు. ''ఇది చాలా తప్పు. కోచ్ మాటలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఏడేళ్ల తర్వాత తమిళనాడును సెమీఫైనల్కు చేర్చిన కెప్టెన్కు అండగా నిలవాలి. రాబోయే రోజుల్లో ఇది మంచి ప్రారంభంగా భావించాలి. కానీ ఇక్కడ కెప్టెన్ను, జట్టు మొత్తాన్ని కోచ్ నూతిలో తోసేశాడు'' అని దినేశ్ కార్తిక్ ట్వీట్ చేశాడు.