రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో సీజన్ను ట్రోఫీ లేకుండా ముగించింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తేడాతో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది.
రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో, 2x4, 2x6), విరాట్ కోహ్లి (33; 24 బంతుల్లో, 3x4, 1x6) టాప్ స్కోరర్లు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/44) మూడు, అశ్విన్ (2/19) రెండు వికెట్లు తీశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45; 30 బంతుల్లో, 8x4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో, 2x4, 2x6), హెట్మెయిర్ (26; 14 బంతుల్లో, 3x4, 1x6) విజయంలో కీలక పాత్ర పోషించారు.

అయితే ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ తరఫున పోరాడుతున్న విరాట్ కోహ్లిని మరో ఫ్రాంచైజీకి వెళ్లమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సూచించాడు. ఐపీఎల్ ట్రోఫీని సాధించడానికి కోహ్లి అర్హుడని, ఎంతో మంది క్రీడా దిగ్గజాలు ఇతర ఫ్రాంచైజీలకు వెళ్లి కీర్తి గడించారని అన్నాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 15 మ్యాచ్ల్లో 71 సగటుతో 741 పరుగులు చేశాడు.
''గతంలో కూడా చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఇతర క్రీడలలోని గొప్ప ఆటగాళ్లు ఇతర ఫ్రాంచైజీలకు వెళ్లి కీర్తి గడించారు. కోహ్లి జట్టును గెలిపించడానికి మరోసారి ప్రయత్నించాడు. తీవ్రంగా కష్టపడ్డాడు. ఆరెంజ్ క్యాప్ను మరోసారి అందుకున్నాడు. కానీ ఆర్సీబీ మరోసారి విఫలమైంది. ఆ ఫ్రాంచైజీ వాణిజ్య పరమైన విలువను అతను తీసుకువస్తున్నాడని నాకు తెలుసు. కానీ కోహ్లి ట్రోఫీని అందుకోవడానికి అర్హుడు. టైటిల్ను అందుకోవడానికి తనకి సహాయపడే జట్టులో అతను ఉండాలి''
''కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లాలి. అతను ఢిల్లీ బాయ్. కోహ్లికి యంగ్ ఫ్యామిలీ ఉంది. అతను కుటుంబంతో కూడా సమయం గడపాలి. ఢిల్లీ తరఫున ఆడితే అతను తన ఇంట్లో ఉంటూ కుటుంబంతో కూడా సమయాన్ని గడపవచ్చు. అంతేగాక బెంగళూరు తరహాలోనే ఢిల్లీ జట్టు కూడా నిరాశలో ఉంది. దీని గురించి విరాట్ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. బెక్హమ్, రొనాల్డో, మెస్సీ కూడా ఫ్రాంచైజీలను విడిచిపెట్టినవాళ్లే'' అని కెవిన్ పీటర్సన్ అన్నాడు.