ప్రపంచ క్రికెట్లో 24 గంటల వ్యవధిలోనే రెండు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. సారథి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు రెండు దేశాల కెప్టెన్లు ప్రకటించడం గమనార్హం. పాకిస్థాన్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్సీకి గుడ్ బై ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ఆటపై మరింత దృష్టి సారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాబర్ వివరించాడు.
తాజాగా న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ టిమ్ సౌథీ కూడా సారథి బాధ్యతల నుంచి తప్పుకుంటన్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయం జట్టుకు మేలు చేస్తుందని భావిస్తున్నట్లు సౌథి తెలిపాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో కివీస్ 0-2తో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2022 డిసెంబర్లో కేన్ విలియమ్సన్ స్థానంలో సౌథి టెస్టు కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు.

14 టెస్టుల్లో న్యూజిలాండ్ను సౌథీ నడిపించాడు. ఆరు విజయాలు, ఆరు ఓటములు, రెండు డ్రాలతో ఫలితాన్ని పొందాడు. ''నాకెంతో ప్రత్యేకమైన ఫార్మాట్లో న్యూజిలాండ్కు సారథిగా వ్యవహిరించడంతో ఎంతో గౌరవం, ప్రత్యేకత. నా కెరీర్లో ఎల్లప్పుడూ జట్టును మొదటి స్థానంలో ఉంచడానికే ప్రయత్నించా. ఇప్పుడు ఈ నిర్ణయం జట్టుకు ఉత్తమమైనదిగా భావిస్తున్నా. ఇక మైదానంలో నా ప్రదర్శనపై మరింత దృష్టి సారిస్తూ, వికెట్లు సాధిస్తూ, టెస్టుల్లో జట్టును గెలిపించడానికి ప్రయత్నిస్తా''
''ఇక ఎప్పటిలాగే, నా సహచరులకు, అంతర్జాతీయ వేదికపై దూసుకెళ్తున్న యువ బౌలర్లకు మద్దతు ఇస్తూనే ఉంటా. టామ్ లాథమ్కు కొత్త పాత్రలో కలిసిరావాలని కోరుకుంటున్నా. ఏళ్లుగా అతను నాకు సహకరిస్తున్నట్లుగానే తన ప్రయాణంలోనే నేను టామ్కు అండగా ఉంటా'' అని టిమ్ సౌథీ పేర్కొన్నాడు. టిమ్ సౌథీ స్థానంలో న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్గా టామ్ లాథమ్ ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ 82 టెస్టులు, 147 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన టిమ్ సౌథీ 102 టెస్టులు ఆడాడు. 382 వికెట్లు పడగొట్టాడు. కాగా, అక్టోబర్ 16 నుంచి భారత్తో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.