న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్ తన సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు కివీస్ అర్హత సాధిస్తే.. టైటిల్ పోరు ఆఖరిదని తెలిపాడు. వచ్చే ఏడాది జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటూ పెరిగానని, 18 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించడం గొప్ప గౌరవమని టిమ్ సౌథి పేర్కొన్నాడు. అయితే తనకెంతో ఇచ్చిన ఆట నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని అన్నాడు. తన గుండెల్లో టెస్టు క్రికెట్ ఎప్పడూ ప్రత్యేక స్థానంలో ఉంటుందని తెలిపాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లోనే అరంగేట్రం చేశానని, ఇప్పుడు ఇంగ్లండ్తోనే కెరీర్ ముగిస్తున్నాని సౌథి పేర్కొన్నాడు.

ఇటీవల భారత్తో జరిగిన టెస్టు సిరీస్కు ముందు టిమ్ సౌథి న్యూజిలాండ్ జట్టు సారథి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ప్రకటించిన నెల రోజులకే టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 28న తొలి టెస్టు ప్రారంభం కానుంది. హామిల్టన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు జరగనుంది.
న్యూజిలాండ్ తరఫున 35 ఏళ్ల టిమ్ సౌథి 104 టెస్టులు ఆడాడు. 385 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ ఆకట్టుకున్నాడు. 2185 పరుగులు చేశాడు. ఇక 161 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. వన్డేల్లో 221 వికెట్లు, పొట్టి ఫార్మాట్లో 164 వికెట్లు పడగొట్టాడు. కాగా, టెస్టు కెరీర్లో సౌథి అనేక ఘనతలు అందుకున్నాడు.
న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా టిమ్ సౌథి రికార్డులు నెలకొల్పాడు. అలాగే టెస్టుల్లో బంతుల పరంగా 2000+ పరుగుల మార్క్ను వేగంగా అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆరో ఆటగాడిగానూ టిమ్ సౌథి నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో సౌథి 93 సిక్సర్లు కొట్టాడు.